ఐపీఎల్ 2025 ఫైనల్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)ఈ సారి కచ్చితంగా టైటిల్ గెలుస్తుందని ఆ జట్టు అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్ కింగ్స్తో గురువారం జరిగిన క్వాలిఫయర్-1లో సమష్టిగా రాణించిన ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్, బౌలింగ్లో దుమ్మురేపి పంజాబ్ కింగ్స్ను చిత్తు చేసింది.
నాలుగో సారి ఫైనల్ చేరిన ఆర్సీబీ.. 18 ఏళ్ల తమ టైటిల్ కలను సాకారం చేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. గతంలో కంటే ఈసారి ఆర్సీబీ పటిష్టంగా ఉందని, ఏ ఒక్కరిపైనో ఆధారపడటం లేదని కప్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటకకు చెందిన ఆర్సీబీ డైహార్డ్ ఫ్యాన్ శివానంద్ మల్లన్నవర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఓ లేఖ రాసాడు.

ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ విజేతగా నిలుస్తుందని, సంబరాలు చేసుకోవడానికి జూన్ 4వ తేదీన సెలువు ఇవ్వాలని కోరాడు. అంతేకాకుండా ఆర్సీబీ టైటిల్ గెలిచిన జూన్ 3ను కార్ణాటక రాష్ట్ర పండుగగా గుర్తించి.. ప్రతీ ఏటా సెలవు ఇవ్వాలని తన లేఖలో అభ్యర్థించాడు. కర్ణాటక రాజ్యోత్సవంలాగా.. ఆర్సీబీ విజయాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పండుగ వాతావరణంలో జరుపుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని సూచించాడు.
కర్ణాటకలోని గోకాక్కు చెందిన శివానంద మల్లన్నవర్ .. సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న టైటిల్ను ఆర్సీబీ గెలిస్తే ప్రతీ ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుందని, ఈ చారిత్రాత్మక క్షణానికి గుర్తుగా సెలవు ప్రకటించాలని తన లేఖలో సీఎంను కోరాడు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జూన్ 3న అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్లో క్వాలిఫయర్-2 విజేతతో ఆర్సీబీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. గతంలో మూడు సార్లు ఫైనల్ చేరిన ఆర్సీబీ(2009, 2011, 2016)కి నిరాశే ఎదురైంది.