న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం 'ఫ్యామిలీ మ్యాన్'వెబ్ సిరీస్ మానియా నడుస్తోంది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన ఈ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకుంటుంది. ఏ నలుగురు కలిసినా.. మరే సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ చూసినా ఈ వెబ్సిరీస్కు సంబంధించిన విషయాలే కనిపిస్తున్నాయి. టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా సైతం.. ఈ వెబ్ సిరీస్ మత్తులో మునిగినట్లు తెలుస్తోంది. తాజాగా ట్విటర్ వేదికగా అతను చేసిన కామెంటే దీనికి నిదర్శనం. టీమిండియా యువ పేసర్ దీపక్ చాహర్ తన న్యూలుక్కు సంబంధించిన ఫొటోను ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫొటోలో దీపక్ చాహర్ టెర్నరిస్ట్ క్యారెక్టర్ను పోలీ ఉన్నాడు. దాంతో రైనా ఫ్యామిలీ మ్యాన్ పార్ట్ 3 వస్తుంది బ్రో అని కామెంట్ చేశాడు.
Family part 3 on the way bro ! 🙌👀
— Suresh Raina🇮🇳 (@ImRaina) June 9, 2021
ఇక అభిమానులు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఈ వెబ్సిరీస్లోని లీడ్ రోల్ శ్రీకాంత్.. ఫ్యామిలీ అడ్వైజర్ను కలిసే సీన్ చాహర్కు సరిపోతుందని కామెంట్ చేస్తున్నారు.
ప్రస్తుతం రైనా చేసిన కామెంట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇక ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. సెకండ్ సీజన్లో టాలీవుడ్ హీరోయిన్ సమంతా కీలక పాత్ర పోషించింది. నెగటీవ్ రోల్ అయినప్పటికీ.. రాజీ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సెకండ్ సీజన్ను తమిళులు వ్యతిరేకిస్తున్నారు. తమను కించపరిచే సీన్లున్నాయని, నిషేధించాలని భారత ప్రభుత్వానికి తమిళనాడు గవర్నమెంట్ లేఖ కూడా రాసింది. తెలుగు వారు, చిత్తూరు జిల్లాకు చెందిన రాజ్ అండ్ డీకే( రాజ్ నిడిమోరి, దాసరి కృష్ణ) ఈ వెబ్ సిరీస్ను డైరెక్ట్ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో మూడో పార్ట్ రానున్నట్లు తెలుస్తోంది.
ఇక ఐపీఎల్ 2021 సీజన్ అర్థంతరంగా వాయిదా పడటంతో సురేశ్ రైనా, దీపక్ చాహర్ ఇంటికే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో చాహర్కు చోటు దక్కలేదు. అయితే జూలైలో శ్రీలంకలో పర్యటించనున్న భారత బి జట్టులో అతనికి చోటు దక్కే అవకాశాలున్నాయి. రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో శిఖర్ ధావన్ నేతృత్వంలో ఈ జట్టు శ్రీలంకలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ టూర్ షెడ్యూల్ను అధికారిక బ్రాడ్ కాస్టర్ సోనీ ఇండియా ప్రకటించింది. త్వరలోనే జట్టును కూడా ఎంపిక చేయనున్నారు.