ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి ముందు టీమిండియా ఆటగాళ్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి మంచి జోష్లో ఉన్న టీమిండియా ఆటగాళ్లకు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నట్లు సమాచారం. ఆటగాళ్ల క్రమశిక్షణకు సంబంధించి బీసీసీఐ తీసుకొచ్చిన కొత్త గైడ్లైన్స్ను ఛాంపియన్స్ ట్రోఫీ నుంచే అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
న్యూ గైడ్లైన్స్ అమలు..
బీసీసీఐ కొత్త పాలసీని అమలు చేస్తే ఆటగాళ్లతో పాటు కుటుంబ సభ్యులను అనుమతించరు. ఫిబ్రవరి 19న ఛాంపియన్స్ ట్రోఫీకి తెరలేవనుండగా.. ఫిబ్రవరి 20 బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్తో టీమిండియా తమ క్యాంపైన్ను ప్రారంభించనుంది. ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో హై ఓల్టేజ్ మ్యాచ్ ఆడనున్న భారత్.. మార్చి 2న న్యూజిలాండ్తో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. భారత్ మ్యాచ్లన్నీ దుబాయ్ వేదికగానే జరగనున్నాయి.

బీసీసీఐ తీసుకొచ్చిన కొత్త గైడ్లైన్స్ పాలసీ ప్రకారం 45 రోజులకు పైగా ఉండే విదేశీ పర్యటనల్లోనే కుటుంబ సభ్యులను అనమతించాలి. అది కూడా వారు అక్కడ రెండు వారాలకు మించి ఉండకూడదు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ ఫైనల్ చేరినా.. మూడు వారాల్లోనే ఈ పర్యటన ముగియనుంది. దాంతో భారత ఆటగాళ్లకు తమ కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్ల వెసులుబాటు లేకుండా పోయింది.
ఓ సీనియర్ ప్లేయర్ అడిగినా..
'ఏదైనా మార్పు జరిగితే అప్పుడు భిన్నంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆటగాళ్లు తమ వెంట సతీమణులను తీసుకెళ్లలేరు. జట్టులోని ఓ సీనియర్ ప్లేయర్ ఇప్పటికే ఈ విషయంపై బీసీసీఐ అధికారులతో సంప్రదింపులు జరిపాడు. కానీ వారు పాలసీ నిర్ణయం ప్రకారం నడుచుకోవాలని చెప్పారు. ఈ పర్యటన నెల రోజుల్లోపే ముగియనుంది. ఆటగాళ్లతో కుటుంబ సభ్యులను అనుమతించరు.
ఒకవేళ మినహాయింపులు ఇస్తే.. కుటుంబ సభ్యుల ఖర్చులను సదరు ఆటగాళ్లే భరించాల్సి ఉంటుంది. బీసీసీఐ మాత్రం ఒక్క రూపాయి కూడా చెల్లించదు.'అని బోర్డుకు చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపాడు. ఫిబ్రవరి 15న భారత జట్టు దుబాయ్కి బయల్దేరనుంది.