న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ అనూహ్య పరాజయాన్ని జీర్ణించుకోలేకపోయిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా భారత క్రికెటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపెనర్ రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్లతో పాటు మహమ్మద్ షమీపై ట్రోలింగ్కు దిగారు. అయితే కొంతమంది హద్దులు ధాటి కామెంట్స్ చేశారు. ముఖ్యంగా మహమ్మద్ షమీ మతాన్ని ప్రస్తావిస్తూ జుగుప్సాకరంగా ట్రోల్ చేశారు. షమీ వెంటనే పాకిస్థాన్ వెళ్లిపోవాలని, ముస్టిం అయిన అతను పాకిస్థాన్ విజయానికి పరోక్షంగా సహకరించాడని ఘాటుగా కామెంట్ చేశారు.
అయితే షమీపై జరిగిన ట్రోలింగ్పై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా రాజకీయంగా దుమారమే రేగింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, రాహుల్ గాంధీ మాజీ క్రికెటర్లు, అభిమానులు ఈ ట్రోలింగ్ను ఖండించారు. దేశంలో ముస్లింల పట్ల ఉన్న ద్వేషానికి ఇదే ఉదాహరణని ఒవైసీ చెప్పుకొచ్చాడు. షమీ ఒక్కడే విఫలమయ్యాడా? అని ప్రశ్నించాడు. ఒవైసీతో పాటు రాహుల్ గాంధీ షమీ ట్రోలింగ్ను ప్రస్తావిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ , సెహ్వాగ్, గంభీర్ , ఇర్ఫాన్ పఠాన్, యుజ్వేంద్ర చాహల్లు కూడా షమీకి బాసటగా నిలిచారు. హర్షా భోగ్లే కూడా షమీకి మద్దతుగా నిలుస్తూ ట్రోల్ చేస్తున్న వారికి ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
అయితే, ఈ ట్రోలింగ్ పాకిస్థాన్ నుంచే మొదలైందని తెలుస్తోంది. ఈ ట్రోల్స్ అన్నీ పాకిస్తాన్కు చెందినవారే చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ట్విట్టర్ లో చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కావాలని విద్వేషం వెదజల్లాలనే కారణంతోనే.. ఇలా చేసినట్లు తెలుస్తోంది. ముస్లిం క్రికెటర్ అయిన షమీపై ఆన్ లైన్ లో వేదింపులకు గురి చేశారని.. ఎనిమిది మంది ఇన్ స్టాగ్రామ్ ఖాతాలను గుర్తించారని.. వాటి నుంచే ఈ ఫేక్ ప్రచారం మొదలైందని గుర్తించినట్లు తెలుస్తోంది.
పాక్తో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 151 పరుగులు చేసింది. 152 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన పాక్.. 18 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో షమీ 3.5 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చాడు. తొలి మూడు ఓవర్లు బాగానే వేసిన షమీ.. ఆఖరి ఓవర్లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
ఇక, టీమిండియా తమ తదుపరి మ్యాచ్ న్యూజిలాండ్తో ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిచి సెమీస్ ఆశలు సజీవంగా ఉంచాలని టీమిండియా ప్రయత్నిస్తోంది. మరోవైపు, న్యూజిలాండ్ కూడా పాక్ చేతిలో ఓడి విజయం కోసం ఎదురు చూస్తుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఆదివారం జరగనుంది.