ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రానే తమ ఓటమిని శాసించాడని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. బుమ్రా అసాధారణ ప్రదర్శన కనబర్చాడని కొనియాడిన డుప్లెసిస్.. అతనిలాంటి బౌలర్ తమ జట్టులో ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ఫాఫ్ డుప్లెసిస్.. టాస్ ఓడిపోవడం నుంచి బ్యాటింగ్, బౌలింగ్లో తమకు ఏది కలిసిరాలేదని చెప్పాడు. 250 పరుగులు చేయాల్సిన పిచ్పై 196 పరుగులు మాత్రమే చేయడంతో ఘోర పరాజయం తప్పలేదన్నాడు.

టాస్ నుంచి ఏదీ కలిసి రాలేదు..
'ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టమే. పిచ్ కండిషన్స్తో పాటు డ్యూ రావడం మా అవకాశాలను దెబ్బతీసింది. ఇలాంటి పిచ్లపై టాస్ గెలవడం చాలా ముఖ్యం. ముంబై ఇండియన్స్ అసాధారణ ప్రదర్శనతో మాపై ఒత్తిడి పెట్టింది. ఈ మ్యాచ్లో మేం చాలా తప్పిదాలు చేశాం. పవర్ ప్లేలో ధాటిగా ఆడలేకపోయాం.
డ్యూ ప్రభావం ఉన్నప్పుడు 250 ప్లస్ పరుగులు చేసినా కష్టమే. అలాంటిది మేం 196 పరుగులకే పరిమితమయ్యాం. ఇది చాలా తక్కువ. డ్యూ కారణంగా బాల్ పూర్తి తడిగా మారిపోయింది. దాంతోనే బంతిని పలుమార్లు మార్చారు. మా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. బ్యాటింగ్లో మేం కొన్ని మూమెంటమ్స్ చేజార్చుకున్నాం.
బుమ్రా దెబ్బతీసాడు..
నేను, పటీదార్ మంచి భాగస్వామ్యం నెలకొల్పినా.. బుమ్రా దెబ్బతీసాడు. అతను బంతిని అందుకున్న ప్రతీసారి మమ్మల్ని దెబ్బకొట్టాడు. తీవ్ర ఒత్తిడిలోనూ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. అతనిలో చాలా బౌలింగ్ నైపుణ్యాలు ఉన్నాయి. ఒకే యాక్షన్తో అనేక వేరియేషన్స్ రాబట్టగలడు.
లసిత్ మలింగా గైడెన్స్లో బుమ్రా మరింత రాటుదేలాడు. బుమ్రా లాంటి బౌలర్ మా జట్టులో ఉంటే బాగుండేది. మేం బ్యాటింగ్లోనే మెరుగవ్వాలి. మా బౌలింగ్ బలహీనమనే విషయం తెలిసిందే. భారీ స్కోర్లు చేస్తేనే విజయాలు అందుకోగలుగుతాం. పవర్ ప్లేలోనే దూకుడుగా బ్యాటింగ్ చేయాల్సి ఉంది.'అని ఫాఫ్ డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.
వన్సైడ్ మ్యాచ్..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్(40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 61), రజత్ పటీదార్(26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 50), దినేశ్ కార్తీక్(23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 53 నాటౌట్)హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(5/21) నిప్పులు చెరిగాడు. ఇషాన్ కిషన్(34 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లతో 69), సూర్యకుమార్ యాదవ్(19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 52) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.