చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) సారథి ఫాఫ్ డుప్లెసిస్ ప్రశంసల జల్లు కురిపించాడు. ధోనీ ఆల్టైమ్ గ్రేటెస్ట్ కెప్టెన్ అని కొనియాడాడు. IPL 2024 సీజన్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన ఫాఫ్ డుప్లెసిస్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడటం తన కెరీర్ను మలుపు తిప్పిందని గుర్తు చేసుకున్నాడు. ధోనీపై విజయం సాధించాలనుకున్నా.. అతనిపై ఉన్న గౌరవంతో ఓడించలేమని చెప్పుకొచ్చాడు. 'మహేంద్ర సింగ్ ధోనీ ఆల్టైమ్ గ్రేటెస్ట్ కెప్టెన్. కొన్నేళ్ల పాటు అతని సారథ్యంలో ఆడే అవకాశం వచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నాను.

నా కెరీర్కు టర్నింగ్ పాయింట్..
చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడటం నా కెరీర్ను మలుపు తిప్పింది. ధోనీని చూసినప్పుడల్లా ఆయన నాకు ఓ పెద్దన్నలా అనిపిస్తాడు. ఎవరైనా ఆయనను ఓడించాలనుకుంటారు. కానీ ఓడించలేరు. ఎందుకంటే అతనిపై ఉన్న గౌరవం అలాంటిది.'అని ఫాఫ్ డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.
మార్చి 22న ఐపీఎల్ 2024 సీజన్కు తెరలేవనుండగా తొలి మ్యాచ్లోనే ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్తో ఆర్సీబీ తలపడనుంది. ఈ క్రమంలోనే ధోనీపై ఫాఫ్ డుప్లెసిస్ (Faf du Plessis) ప్రశంసల జల్లు కురిపించాడు.
మ్యాడ్ మ్యాక్సీ..
ఇక గతేడాదిలానే తమ జట్టు విధ్వంసకర బ్యాటర్ గ్లేన్ మ్యాక్స్ వెల్ చెలరేగుతాడని ఫాఫ్ డుప్లెసిస్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్కు ముందు ఎప్పుడూ మ్యాక్స్వెల్ అసలు సత్తాను చూడలేదని చెప్పాడు. ఆర్సీబీ తరఫున గతేడాది అతను నిలకడగా బ్యాటింగ్ చేశాడని, ఈ ఏడాది కూడా అదే జోరును కొనసాగిస్తాడని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.
'ఐపీఎల్కు ముందు ఎప్పుడూ నేను గ్లేన్ మ్యాక్స్వెల్ అసలు సిసలు ఆటను చూడలేదు. కానీ ఆర్సీబీ తరఫున అతను అత్యంత నిలకడగా రాణించాడు. గతేడాది అతనితో కలిసి ఆడుతుంటే.. బ్యాటింగ్ ఇంత సులువా? అని అనుకునేలా చేశాడు.ఎందుకంటే అతను స్పిన్నర్లను ఊచకోత కోసాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లోనూ అతను సత్తా చాటాడు. ఈ సీజన్లోనూ అదే జోరును కొనసాగిస్తాడని ఆశిస్తున్నా. 'అని ఫాఫ్ డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2023 సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ 183.49 స్ట్రైక్రేట్తో 400 పరుగులు చేశాడు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.