
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగుతున్న దినేశ్ కార్తీక్పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ప్రశంసల జల్లు కురిపించాడు. సూపర్ ఫామ్లో ఉన్న కార్తీక్ కోసం తాను ఔటవ్వాలనుకున్నానని తెలిపాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 67 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. చివర్లో బ్యాటింగ్కు వచ్చిన కార్తీక్ 8 బంతుల్లో 4 సిక్సర్లు, ఓ ఫోర్తో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని విధ్వంసకర బ్యాటింగ్తో మూమెంటమ్ మొత్తం ఆర్సీబీ వైపు మళ్లీ భారీ విజయాన్నందుకుంది.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఫాఫ్ డుప్లెసిస్ దినేశ్ కార్తీక్ బ్యాటింగ్కు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ కొనియాడాడు. 'దినేశ్ కార్తీక్ ఇలాగే సిక్సులు కొడుతూ బ్యాటింగ్ చేస్తుంటే వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండాలనుకుంటాం. నిజం చెప్పాలంటే నేను బ్యాటింగ్ చేసేటప్పుడు చాలా అలసిపోయా. దాంతో కార్తీక్ను క్రీజులోకి తీసుకురావాలనుకున్నా. అప్పుడు నేను రిటైర్ ఔట్గా వెనుదిరగాలనుకున్నా. అతను మంచి ఫామ్లో ఉన్నాడు. అయితే, ఈ మ్యాచ్లో అతని క్యాచ్ వదిలేశారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కార్తీక్ దంచికొట్టాడు'అని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.
ఆర్సీబీ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో దినేశ్ కార్తీక్ ఇచ్చిన సునాయస క్యాచ్ను రాహుల్ త్రిపాఠి వదిలేయడం మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది. ఈ అవకాశంతో చెలరేగిన కార్తీక్.. 4 బంతుల్లోనే 22 పరుగులు పిండుకోవడంతో మూమెంటమ్ ఆర్సీబీ వైపు మళ్లింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన 20 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(0) గోల్డెన్ డకౌటైనా.. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(50 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 73 నాటౌట్), రజత్ పటిదార్(38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 48) రాణించారు. చివర్లో గ్లేన్ మ్యాక్స్వెల్(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 33), దినేశ్ కార్తీక్(8 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 30 నాటౌట్) మెరుపులు మెరిపించారు. సన్రైజర్స్ బౌలర్లలో జగదీష సుచిత్ రెండు వికెట్లు తీయగా.. కార్తీక్ త్యాగీ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్రైజర్స్ నిర్ణీత 19.2 ఓవర్లలో 125 పరుగులకు కుప్పకూలింది. రాహుల్ త్రిపాఠి(37 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 58) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఎయిడెన్ మార్కరమ్(21), నికోలస్ పూరన్(19) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. సన్రైజర్స్లో నలుగురు బ్యాటర్లు డకౌట్గా వెనుదిరిగారు. వానిందు హసరంగా కెరీర్ బెస్ట్ (5/18) ప్రదర్శనతో ఆరెంజ్ ఆర్మీ పతనాన్ని శాసించాడు. జోష్ హజెల్ వుడ్ 2 వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్, గ్లేన్ మ్యాక్స్వెల్ ఓ వికెట్ పడగొట్టాడు.