జైపూర్: ఐపీఎల్ 2023 సీజన్లో ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారీ విజయాన్నందుకోవడంపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ప్రదర్శనతో తమ జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిందని, తదుపరి రెండు మ్యాచ్ల్లో చెలరేగిపోతామని తెలిపాడు. రాజస్థాన్ రాయల్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన ఆర్సీబీ.. 112 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
ఈ విజయంతో ఆర్సీబీ నెట్రన్రేట్ అమాంతం మెరుగైంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఫాఫ్ డుప్లెసిస్.. తుది జట్టులో చేసిన మార్పులు కలిసొచ్చాయని తెలిపాడు. పిచ్ కండిషన్స్ తగ్గట్లు బ్యాటింగ్ చేశామని, చివరి ఓవర్లో మూమెంటమ్ దక్కిందని తెలిపాడు. 'మా నెట్ రన్రేట్ చాలా మెరుగైంది. ఇది చాలా కఠిన పిచ్. పరిస్థితులకు తగ్గట్లు మేం బ్యాటింగ్ చేశాం.

పవర్ ప్లేలో బ్యాటింగ్ చేసిన తర్వాత ఈ వికెట్పై 160 పరుగులు చేసినా సరిపోతుందని భావించాం. 15వ ఓవర్ వరకు ఇన్నింగ్స్ను అద్భుతంగా నిర్మించాం. ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయినా.. చివరి ఓవర్లో మూమెంటమ్ చేజారకుండా జాగ్రత్తపడ్డాం. ఈ మూమెంటమ్ను మ్యాచ్ అసాంతం కొనసాగించి విజయాన్నందుకున్నాం. మైఖేల్ బ్రెస్వెల్ అసాధారణ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు.
వాస్తవానికి అతను ఈ వారంలో ప్రతీ రోజు బౌలింగ్ చేయాలనుకున్నాడు. మాకు లెఫ్టార్మ్ స్పిన్నర్ కావాలనుకున్నాం. షెహ్బాజ్ అహ్మద్ను ఓ ఆప్షన్గా పెట్టుకున్నాం. రిస్ట్ స్పిన్ను అటాకింగ్ ఆప్షన్గా ఉపయోగించుకోవాలనుకున్నాం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన గత మ్యాచ్లోనూ ఈ మార్పులు చేయాల్సింది. ఈ రోజు జట్టుకు కలిసొచ్చింది. చివరి రెండు మ్యాచ్ల్లో సత్తా చాటేంత ఆత్మవిశ్వాసం మా ఆటగాళ్లకు దక్కింది.'అని ఫాఫ్ డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్(44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 55), గ్లేన్ మ్యాక్స్వెల్(33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 54) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. చివర్లో అనూజ్ రావత్(10 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 29 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆడమ్ జంపా, కేఎమ్ ఆసిఫ్ రెండే వికెట్లు తీయగా.. సందీప్ శర్మ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 10.3 ఓవర్లలో 59 పరుగులకే కుప్పకూలింది. షిమ్రాన్ హెట్మైర్(19 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 35) మినహా అంతా విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో వ్యాన్ పార్నెల్(3/10) మూడు వికెట్లతో చెలరేగగా.. మైఖెల్ బ్రేస్వెల్(2/16), కర్ణ్ శర్మ(2/19) రెండేసి వికెట్లు పడగొట్టారు.