కోల్కతా: కోల్కతా నైట్రైడర్స్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ అసాధారణ బ్యాటింగ్తో తమ ఓటమిని శాసించాడని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా కేకేఆర్తో గురువారం జరిగిన మ్యాచ్లో 81 పరుగుల భారీ తేడాతో ఆర్సీబీ ఓటమిపాలైన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ఫాఫ్ డుప్లెసిస్.. టీమ్ ప్రదర్శన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. కేకేఆర్ బ్యాటింగ్లో శార్దూల్ చెలరేగితే.. బౌలింగ్లో స్పిన్నర్లు సత్తా చాటారాని కొనియాడాడు. ఈ పరాజయంతో తమ టీమ్ తప్పిదాలు తెలుసొచ్చాయని, వీలైనంత త్వరగా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామన్నాడు.

'బంతితో మేం మెరుగైన ఆరంభాన్ని అందుకున్నాం. 13 ఓవర్లలో 100 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు తీసాం. కానీ శార్దూల్ ఠాకూర్ అసాధారణ బ్యాటింగ్తో మ్యాచ్ను మా నుంచి లాగేసుకున్నాడు. అతని అసాధారణ ఇన్నింగ్స్తో ఈ వికెట్పై మేం 20-25 పరుగులు అదనంగా సమర్పించుకున్నాం. కేకేఆర్ లెగ్ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.
మా టాప్ క్లాస్ బ్యాటర్లను పెవిలియన్ చేర్చారు. నరైన్, చక్రవర్తీ అసాధారణ ప్రదర్శన కనబరిచారు. తమ మిస్టరీ స్పిన్తో మా బ్యాటర్లను బోల్తా కొట్టించారు. ఇది బ్యాటింగ్కు అనుకూలమైన వికెట్. కానీ మా బ్యాటింగ్ చాలా యావరేజ్గా ఉంది. ఇలాంటి మ్యాచ్లు ఓడినా.. లక్ష్యాన్ని సమీపించే ప్రయత్నం చేయడం చాలా ముఖ్యం.
ఈ రోజు కనీసం 160 పరుగులైనా చేయాల్సింది. టీ20 క్రికెట్ చాలా వేగంగా ముందుకు సాగుతూ ఉంటుంది. మేం మా తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటాం. ఈ రోజు మాకు కలిసి రాలేదు. వ్యూహాత్మకంగా కూడా మేం కాస్త మెరుగ్గా ఉండాల్సింది. డెత్ బౌలింగ్ అంత సులువైన పని కాదు. సిరాజ్, హర్షల్ క్వాలిటీ బౌలర్లు. వేగంగా పుంజుకుంటారు.'అని ఫాఫ్ డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగులు చేసింది. శార్దూల్ ఠాకూర్(29 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 68), రెహ్మానుల్లా గుర్బాజ్(44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 57) హాఫ్ సెంచరీలతో రాణించగా.. రింకూ సింగ్(33 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 46) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.

ఆర్సీబీ బౌలర్లలో కర్ణ్ శర్మ, డేవిడ్ విల్లే రెండు వికెట్లు తీయగా.. మైఖేల్ బ్రేస్వెల్, మహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్సీబీ 17.4 ఓవర్లలో 123 పరుగులకే కుప్పకూలింది. విరాట్ కోహ్లీ(18 బంతుల్లో 3 ఫోర్లతో 21), ఫాఫ్ డుప్లెసిస్(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 23) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ నాలుగు వికెట్లు తీయగా.. సుయాశ్ శర్మ మూడు వికెట్లు పడగొట్టాడు. సునీల్ నరైన్ రెండు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టాడు.