ముంబై: బ్యాటింగ్ వైఫల్యంతో పాటు సూర్యకుమార్ యాదవ్ అసాధారణ ఇన్నింగ్స్ తమ ఓటమిని శాసించిందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో చిత్తయ్యింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ఫాఫ్ డుప్లెసిస్.. అదనంగా మరో 20 పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. ముఖ్యంగా చివరి ఐదు ఓవర్లలో తమ బ్యాటర్లు ధాటిగా ఆడలేకపోయారని తెలిపాడు.

'పిచ్ కండిషన్స్ను పరిగణలోకి తీసుకుంటే బ్యాటింగ్లో మేం 20 పరుగులు తక్కువగా చేశాం. ముంబై ఇండియన్స్ బలమైన చేజింగ్ టీమ్. బ్యాటింగ్లో డెప్త్ కూడా ఉంది. బ్యాటింగ్ సందర్భంగా మేం చివరి ఐదు ఓవర్లను సరిగ్గా ఆడలేకపోయాం. చాలా పరుగులు చేయలేకపోయాం. 200 పరుగులు మంచి స్కోర్ అని పదే పదే చెబుతూ ఆటగాళ్లను ఉత్సాహపరిచాల్సి వచ్చింది.
ముంబై ఇండియన్స్ తొలి 6 ఓవర్లలోనే ఎదురుదాడికి దిగింది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ అసాధారణ బ్యాటింగ్తో చెలరేగాడు. అతన్ని ఆపడం చాలా కష్టం. ఫస్టాఫ్ ఐపీఎల్లో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ సెకండాఫ్లో ఆ జోరు చూపెట్టలేకపోతున్నాడు. మా ఆటగాళ్లంతా సానుకూలంగా బరిలోకి దిగాల్సిన అవసరం ఉంది.
టోర్నీ తుది దశకు చేరుతున్నా కొద్ది వికెట్లు నెమ్మదిగా మారే అవకాశం ఉంది. అలాంటప్పుడు తొలి 6 ఓవర్లలోనే 60 పరుగులు చేయడంపై ఫోకస్ పెట్టాలి.'అని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 199 పరుగులు చేసింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 65), గ్లేన్ మ్యాక్స్వెల్(33 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్లతో 68) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగారు.
చివర్లో దినేశ్ కార్తీక్(18 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 30) మెరుపులు మెరిపించాడు. ముంబై బౌలర్లలో జాసన్ బెహ్రెండార్ఫ్(3/36) మూడు వికెట్లు తీయగా.. కామెరూన్ గ్రీన్, క్రిస్ జోర్డాన్, కుమార్ కార్తీకేయ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ 16.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 200 పరుగులు చేసి 21 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్ర్లతో 83), నెహాల్ వధేరా(32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. ఇషాన్ కిషన్(21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 42) అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. ఆర్సీబీ బౌలర్లలో వానిందు హసరంగా, విజయ్ కుమార్ వైశాఖ్ రెండేసి వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.