
బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి మరో పరాజయం ఎదురైంది. గతంలో మాదిరే ఆ జట్టు 212 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. లక్నో సూపర్ జెయింట్స్తో సోమవారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఆర్సీబీ ఒక్క వికెట్ తేడాతో ఓటమిపాలైంది.
లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు మార్కస్ స్టోయినీస్, నికోలస్ పూరన్ అసాధారణ బ్యాటింగ్తో తమ పతనాన్ని శాసించారని ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. లక్నో బ్యాటర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్లో ఓటమిపాలవ్వడం తీవ్ర నిరాశకు గురిచేసిందన్నాడు.
'ఈ ఓటమి చాలా నిరాశకు గురి చేసింది. లక్నో బ్యాటర్లు మిడిల్ ఓవర్లలో అద్భుతంగా ఆడారు. అయినా మా బౌలర్లు అసాధారణ ప్రదర్శనతో మ్యాచ్ను ఆఖరి వరకు తీసుకొచ్చారు. చివర్లో రనౌట్ చేసుంటే ఫలితం మాకు అనుకూలంగా ఉండేది. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఈ పిచ్ 7-14 ఓవర్ల వరకు చాలా స్లోగా కనిపించింది. చివరి ఐదు ఓవర్లలో స్కిడ్ అయ్యింది.
అద్భుత షాట్లు క్రికెట్ అభిమానులను అలరించాయి. మార్కస్ స్టోయినీస్, నికోలస్ పూరన్ బంతిని అద్బుతంగా మిడిల్ చేశారు. మా ప్రధాన బౌలర్ అయిన హర్షల్ పటేల్పై విరుచుకుపడ్డారు. తొలి రెండు ఓవర్లలో ధారళంగా పరుగులిచ్చి.. చివరి ఓవర్ బౌలింగ్ చేయడం చాలా కష్టం. నేను బ్యాటింగ్ చేసేటప్పుడు ఆరంభంలో కాస్త తడబడ్డాను.
కోహ్లీతో కలిసి పుంజుకోవడం సంతోషాన్నిచ్చింది. కొన్నిసార్లు ఆటలో ఇబ్బందులు ఎదురవ్వడం సహజం. బంతిని మిడిల్ చేసిన తర్వాత నాకు బ్యాటింగ్ ఫ్లో లభించింది.'అని ఫాఫ్ డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆర్సీబీ టాప్-3 బ్యాటర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్(44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 79 నాటౌట్), గ్లేన్ మ్యాక్స్వెల్(29 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 59) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. లక్నో బౌలర్లలో అమిత్ మిశ్రా, మార్క్ వుడ్ తలో వికెట్ తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 213 పరుగులు చేసి గెలుపొందింది. మార్కస్ స్టోయినిస్(30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 65), నికోలస్ పూరన్(19 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్లతో 62) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు.