తమ వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ కారణంగానే ఓడిపోయే మ్యాచ్లో విజయం సాధించామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం ఈ గెలుపుపై స్పందించిన ఫాఫ్ డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తీక్ రాణించినా.. మహిపాల్ లోమ్రోర్ చేసిన పరుగులు విజయానికి బాటలు వేసాయన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా అతను విలువైన పరుగు చేశాడని కొనియాడాడు.

'బయటికి చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నా.. లోపల మాత్రం భిన్నంగా ఉన్నాను. టోర్నీ ఆరంభంలోనే ముందంజ వేయాలి. అతి త్వరలోనే మేం ఆ పని చేస్తామని ఆశిస్తున్నా. మా ఆటగాళ్లు చివరి వరకు చాలా ప్రశాంతంగా ఆడారు. మా గెలుపు గుర్రం దినేశ్ కార్తీక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో ఏ దశలోనూ ఓడిపోతామని అనుకోలేదు.
కొత్త రూల్ ప్రకారం ఇంపాక్ట్ ప్లేయర్గా ఎక్స్ట్రా బ్యాటర్ను తీసుకునే అవకాశం ఉందని తెలుసు. మహిపాల్ లోమ్రోర్ అదనపు బ్యాటర్గా బరిలోకి దిగుతాడని ఊహించా. అతను ఈ మ్యాచ్లో అసాధారణ ప్రదర్శన చేశాడు. ఎక్స్ట్రా బ్యాటర్ ఉన్నప్పుడు ఓవర్కు 14-15 పరుగులు చేయాల్సి ఉన్నా విజయం సాధించవచ్చు. దినేశ్ కార్తీక్ వంటి ఆటగాడు జట్టులో ఉండటం మా అదృష్టం.
గత రాత్రి చెప్పినట్లుగానే దినేశ్ కార్తీక్ మాకు చాలా ముఖ్యమైన ఆటగాడు. అతని అనుభవం మాకు ఎంతో ఉపయోగపడుతోంది. ఈ ప్రణాళికలతోనే అతన్ని రిటైన్ చేసుకున్నాం. చిన్నస్వామి మైదానం పిచ్ డీఎన్ఏ తెలుసుకోవడం చాలా కష్టం. ఇది చాలా విభిన్నమైన మైదానం. ఈ రోజు కూడా పిచ్ చాలా భిన్నంగా ఉంది.
ఫాస్ట్గా లేకుండా అనూహ్య బౌన్స్ లభించింది. అలాగే ఫ్లాట్గా ఉంది. పిచ్ కండిషన్స్కు తగ్గట్లు కోహ్లీ అద్భుతంగా ఆడాడు. నవ్వుతూ తన ఆటను ఆస్వాదించాడు. క్రికెట్ పట్ల ఎంతో పిచ్చిగా ఉన్నాడు. ఐపీఎల్కు ముందు తీసుకున్న బ్రేక్ అతనికి బాగా కలిసొచ్చింది. చాలా ఫ్రెష్గా బరిలోకి దిగుతున్నాడు.'అని ఫాఫ్ డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. అనంతరం ఆర్సీబీ 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసి గెలుపొందింది.