బౌలింగ్లో 30-40 పరుగులు అదనంగా ఇచ్చామని, ఈ తప్పిదమే తమ విజయవకాశాలను దెబ్బతీసిందని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో సోమవారం జరిగిన హైస్కోరింగ్ గేమ్లో ఆర్సీబీ 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇది సన్రైజర్స్ హైదరాబాద్కు నాలుగో విజయం కాగా.. ఆర్సీబీకి ఆరో పరాజయం.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ఫాఫ్ డుప్లెసిస్.. విజయం కోసం తమ కుర్రాళ్లు చివరి వరకు పోరాడటం గొప్ప విషయమని తెలిపాడు. 'మా బ్యాటింగ్ ప్రదర్శన చాలా మెరుగైంది. ఇది సరైన టీ20 వికెట్. ఫలితం గురించి ఆలోచించకుండా మేం లక్ష్యాన్ని సమీపంగా వచ్చేందుకు ప్రయత్నించాం. అయితే 280 పరుగుల లక్ష్యం అనేది చాలా ఎక్కువ. చేధించడం చాలా కష్టం.

ఈ రోజు మేం కాస్త భిన్నమైన ప్రణాళికలు, విభిన్నమైన కాంబినేషన్తో బరిలోకి దిగాం. మా ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందనే విషయాన్ని దాచి పెట్టలేం. మా పేసర్లు దారుణంగా విఫలమయ్యారు. బ్యాటింగ్ విభాగంలోనూ కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. పవర్ ప్లే అనంతరం రన్రేట్ తగ్గకుండా ఆడేలా చూసుకోవాలి.
భారీ లక్ష్యమైనా మా కుర్రాళ్లు ఏ మాత్రం వెనుకబడకుండా ఆఖరి వరకు పోరాడారు. మా కుర్రాళ్లు పోరాడిన తీరు అద్భుతం. 30-40 పరుగులు బౌలింగ్లో అదనంగా ఇచ్చాం. ఈ ఫలితం గురించి ఆలోచించకుండా ఫ్రెష్గా బరిలోకి దిగేందుకు చాలా ముఖ్యం. క్రికెట్ అనేది మెంటల్ గేమ్. కొన్నిసార్లు మానసిక ప్రశాంతత కరువవుతోంది. గట్టి పోటీనివ్వాలంటే ప్రశాంతంగా ఉండాలి.'అని ఫాఫ్ డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 287 పరుగుల భారీ స్కోర్ చేసింది. ట్రావిస్ హెడ్(41 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్లతో 102) సెంచరీతో చెలరేగగా.. హెన్రీచ్ క్లాసెన్(31 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్లతో 67), ఎయిడెన్ మార్క్రమ్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 32 నాటౌట్), అబ్దుల్ సమద్(10 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 37 నాటౌట్) మెరుపులు మెరిపించారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులే చేసి ఓటమిపాలైంది. దినేశ్ కార్తీక్(35 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్లతో 83), ఫాఫ్ డుప్లెసిస్(28 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 62)హాఫ్ సెంచరీలతో చెలరేగినా ఫలితం లేకపోయింది. విరాట్ కోహ్లీ(20 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 42) సైతం మెరుపులు మెరిపించాడు. సన్రైజర్స్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్(3/43) మూడు వికెట్లు తీయగా.. మయాంక్ మార్కండే(2/46) రెండు వికెట్లు తీసాడు. నటరాజన్కు ఓ వికెట్ దక్కింది.