బెంగళూరు: బౌలింగ్ వైఫల్యంతో పాటు సరైన ఫినిషింగ్ లేకపోవడంతోనే సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్లో ఓటమిపాలయ్యామని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్తో సోమవారం ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన హై స్కోరింగ్ గేమ్లో ఆర్సీబీ 8 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ఫాఫ్ డుప్లెసిస్.. కీలక సమయంలో దినేశ్ కార్తీక్ ఔటవ్వడం తమ విజయవకాశాలను దెబ్బ తీసిందన్నాడు. దినేశ్ కార్తీక్ మ్యాచ్ ముగిస్తాడని, తాము భావించామని, అతనికి ఇలాంటి మ్యాచ్లు గెలిపించడం వెన్నతో పెట్టిన విద్యని చెప్పుకొచ్చాడు. కానీ చెన్నై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి తమ విజయాన్ని లాక్కున్నారని తెలిపాడు.

బౌలింగ్లో మేం విఫలమయ్యం. 200 పరుగుల కంటే ఎక్కువ స్కోర్ ఇచ్చుకున్నాం. చివరి ఓవర్లలో ఈ నష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేశాం. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అదనంగా 20 పరుగులు సమర్పించుకున్నాం. ఇలాంటి వికెట్స్పై బౌలర్లు స్కిల్ఫుల్గా బౌలింగ్ చేయాలి. సిరాజ్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. బ్యాటింగ్ చివర్లో నేను కాస్త పవర్ కోల్పోయాను. పక్కటెముకలు పట్టేయడంతో స్వేచ్చగా బ్యాటింగ్ చేయలేకపోయాను. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొవడంపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది.'అని ఫాఫ్ డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు భారీ స్కోర్ చేసింది. డేవాన్ కాన్వే(45 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 83), శివమ్ దూబే(27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. అజింక్యా రహానే(20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 37) విలువైన పరుగులు చేశాడు. ఆర్సీబీ బౌలర్లలో వ్యాన్ పార్నెల్, విజయ్ కుమార్ వైశాక్, వానిందు హసరంగా, హర్షల్ పటేల్, సిరాజ్, గ్లేన్ మ్యాక్స్వెల్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 218 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. గ్లేన్ మ్యాక్స్వెల్(36 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్లతో 76), ఫాఫ్ డుప్లెసిస్(33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 62) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది.
చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్పాండే మూడు వికెట్లు తీయగా.. మతీష పతీరణ రెండు వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ సింగ్, మహీష్ తీక్షణ, మొయిన్ అలీ తలో వికెట్ తీసారు.