ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న కీలక మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ అక్షర్ పటేల్ స్థానంలో ఫాఫ్ డుప్లెసిస్ జట్టును నడిపిస్తున్నాడు. అక్షర్ పటేల్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఈ మ్యాచ్కు తాను తాత్కలిక సారథిగా వ్యవహరిస్తున్నట్లు ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు.
'గత రెండు రోజులుగా అక్షర్ పటేల్ అస్వస్థతో బాధపడుతున్నాడు. అతను ఈ రోజు మ్యాచ్ ఆడటం లేదు. అయినా మేం మంచి జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం. ఈ మ్యాచ్ కోసం మేము సిద్ధంగా ఉన్నాము. గత 5-6 మ్యాచ్ల్లో మేము మా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చ లేదు. ప్రతిరోజూ ఓ కొత్త అవకాశం లభిస్తుంది. పిచ్ కొద్దిగా పొడిగా ఉంది. మేము ఛేజింగ్ చేస్తాం. అక్షర్ లేడు, అక్షర్ ఇద్దరు ఆటగాళ్లతో సమానం. అతన్ని భర్తీ చేయడం కష్టం. ఈ మ్యాచ్ ఎలా జరుగుతుందో చూడాలి.'అని ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. 'గత రెండు రోజులుగా పిచ్ కవర్ల కింద ఉంది. మేం కూడా టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. కానీ బ్యాటింగ్ చేసేందుకు కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇప్పటి నుంచి ప్రతీ మ్యాచ్ ముఖ్యమే. మేం అత్యుత్తమ క్రికెట్ ఆడాలనుకుంటున్నాం. మా కుర్రాళ్లంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మా నుంచి ఇంకాస్త మెరుగైన ప్రదర్శన రావాల్సి ఉంది. ప్రేక్షకుల మద్దతు అద్భుతం. మేం సరిగ్గా ఆడనప్పుడు కూడా మాకు అండగా నిలిచారు. తుది జట్టులో ఒక మార్పు చేశాం. బోచ్ స్థానంలో మిచెల్ సాంట్నర్ తుది జట్టులోకి వచ్చాడు.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), అభిషేక్ పోరెల్(వికెట్ కీపర్), సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మాధవ్ తివారీ, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, ముస్తాఫిజుర్ రెహమాన్, ముఖేష్ కుమార్.
ముంబై ఇండియన్స్: ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.