ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా వైఫల్యం కొనసాగుతోంది. ఇప్పటికే 2-1తో వెనుకంజలో నిలిచిన టీమిండియా.. నాలుగో టెస్ట్లోనూ ఓటమి దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్ను డ్రా చేసుకునేందుకు భారత ఆటగాళ్లు పోరాడుతున్నారు. అయితే టీమిండియా వైఫల్యం నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టెస్ట్ల్లో టీమిండియా వరుసగా ఓటమిపాలవుతోంది. హెడ్ కోచ్గా గంభీర్ పర్యవేక్షణలో భారత్ ఇప్పటి వరకు 14 మ్యాచ్లు ఆడి నాలుగు మాత్రమే గెలిచింది. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్లోనూ ఓటమి దిశగా సాగుతోంది.
కోచ్గా గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా.. బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ల సిరీస్ను 2-0తో గెలిచింది. ఆ తర్వాత ఒక్క సిరీస్ గెలవలేదు. న్యూజిలాండ్తో సొంతగడ్డపై జరిగిన మూడు టెస్ట్ల సిరీస్లో అనూహ్యంగా 3-0తో రోహిత్ సేన క్లీన్ స్వీప్ అయ్యింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై ఓ టెస్ట్ సిరీస్లో టీమిండియా క్లీన్ స్వీప్ అవ్వడం ఇదే తొలిసారి. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 3-1తో టీమిండియా కోల్పోయింది. ఈ సిరీస్లో శుభారంభం చేసిన టీమిండియా ఆ తర్వాత మూడు మ్యాచ్లు ఓడి ఓ మ్యాచ్ను డ్రా చేసుకుంది. ఈ పరాజయాలతో డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ బెర్త్ను దక్కించుకోలేకపోయింది.

తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో తొలి మూడు టెస్ట్ల్లో విజయం కోసం ఆఖరి వరకు పోరాడిన భారత్.. ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే టెస్ట్ ఫార్మాట్లో టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ను తప్పించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఇండియన్ టీమ్ క్రికెట్ అనే ట్విటర్ పేజిలో గౌతమ్ గంభీర్ను టెస్ట్ ఫార్మాట్లో హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించేందుకు బీసీసీఐ సిద్దమైందని, వీవీఎస్ లక్ష్మణ్ ఆ బాధ్యతలు చేపట్టబోతున్నాడని పేర్కొంది. దాంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.
గంభీర్పై వేటు పడిందని, కొత్త టెస్ట్ కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నాడనే ప్రచారం జోరు అందుకుంది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని విషయం స్పష్టమైంది. కోచ్ మార్పు విషయంపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సిరీస్ మధ్యలో బోర్డు ఇలాంటి నిర్ణయం తీసుకోదని ఓ అధికారి తెలిపాడు. ఒకవేళ కోచ్ను మార్చాలంటే సిరీస్ అనంతరం చర్చిస్తారని పేర్కొన్నాడు. అయినా గంభీర్ పనితీరుపై బీసీసీఐ సంతృప్తిగా ఉందని చెప్పాడు.