ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వ్యతిరేకంగా భారీ కుట్ర జరుగుతోంది. కొందరు ఆకతాయిలు సోషల్ మీడియా వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీపై పాకిస్థాన్ ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ది హండ్రెడ్ లీగ్లో సన్రైజర్స్ లీడ్స్ కోసం కావ్య మారన్.. పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను కొనుగోలు చేసిన నేపథ్యంలో హైదరాబాద్ జట్టుపై విద్వేషాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు.
సన్రైజర్స్ హైదరాబాద్కు వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా క్యాంపైన్ను నిర్వహిస్తున్నారు. సునీల్ గవాస్కర్ వంటి ఆటగాళ్లు కూడా పాక్ ఆటగాళ్లను కొనుగోలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. కానీ సన్రైజర్స్ టీమ్ పేరును ఆయన ప్రస్తావించలేదు. ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం జరిగే ఈ ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్కు వ్యతిరేకంగా కొందరు నెటిజన్లు అసత్యప్రచారం చేస్తున్నారు.

ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లో ఆర్సీబీ, సన్రైజర్స్ హైదరాబాద్ తలపడటం లేదని, భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అని ప్రచారం చేస్తున్నారు. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఫేక్ పోస్టులు క్రియేట్ చేస్తున్నారు. 'మార్చి 28న జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ కేవలం RCB, SRH మధ్య పోరు కాదు.. అది టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్లాంటిది'అని సెహ్వాగ్ అన్నట్లు ఫేక్ పోస్టులు క్రియేట్ చేసి ఆరెంజ్ ఆర్మీపై విద్వేషాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు.
అయితే సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేయలేదు. ఏఐ టూల్స్ కూడా ఇది ఫేక్ పోస్ట్ అని స్పష్టం చేశాయి. కానీ కొందరు ఆకతాయిలు.. సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ను బాయ్కాట్, బ్యాన్ చేయాలని క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. అయితే ఈ ఫేక్ పోస్ట్లను ఏ మాత్రం క్రాస్ వెరిఫై చేసుకోకుండా కొన్ని వెబ్సైట్స్.. వ్యూస్ కోసం వార్తలు రాస్తున్నాయి. క్రికెట్ అభిమానులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. సన్రైజర్స్ హైదరాబాద్కు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ కుట్రను తిప్పి కొట్టాలని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ పిలుపునిస్తున్నారు. ఇది హైదరాబాద్పై జరుగుతున్న దాడిగా వారు అభివర్ణిస్తున్నారు.
ఐపీఎల్ 2026 సీజన్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ సిద్దమైంది. వెన్ను గాయంతో ప్యాట్ కమిన్స్ ఆరంభ మ్యాచ్లకూ దూరమవడంతో ఇషాన్ కిషన్ను కెప్టెన్గా నియమించారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రీచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, సలీల్ అరోరాలతో ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్ విభాగం భీకరంగా ఉన్నా.. బౌలింగ్ బలహీనంగా ఉంది. పరుగుల వరద పారే చిన్నస్వామి స్టేడియంలో హైదరాబాద్ ఏం చేస్తుందో చూడాలి.