ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్లో సౌత్ హీరోయిన్ శృతి హాసన్ సందడి చేసినట్లు ఎక్స్ వేదికగా ఫేక్ ప్రచారం జరుగుతోంది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్కు శృతి హాసన్ హాజరైందని, భారత్కు మద్దతుగా హల్ఛల్ చేసిందని కొందరు ఆకతాయిలు ఫేక్ పోస్ట్లు సృష్టించారు. టీమిండియా ఆటగాళ్లకు మద్దతు తెలుపుతూ మ్యాచ్ను ఆస్వాదించిందని, ఆమె అందానికి ఫిదా అయిన కెమెరామెన్ పదే పదే శృతి హాసన్ను టీవీలో చూపించాడని ఏఐ సాయంతో పోస్ట్లు క్రియేట్ చేశారు.
ప్రస్తుతం ఈ ఫేక్ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇవి నిజమేనని నమ్మిన కొందరు నెటిజన్లు.. ఆమె హీరోయిన్ అనే విషయం తెలియక శృతి హాసన్ అందాన్ని కొనియాడుతున్నారు. అందానికే అసూయ పుట్టే అందం ఆమె సొంతమని ఎక్స్వేదికగా కవితలు రాస్తున్నారు. దేవుడు సృష్టించిన అత్యంత అందమైన వస్తువు మహిళ అని శృతి హాసన్ను కొనియాడుతున్నారు. అయితే ఈ మ్యాచ్కు శృతి హాసన్ హాజరవ్వలేదు. ఐపీఎల్ మ్యాచ్కు హాజరైన ఫొటోను ఏఐ సాయంతో తాజా మ్యాచ్కు హాజరైనట్లు ఫేక్ ఫొటోను ట్వీట్ చేసి జనాలను తప్పుదోవ పట్టించారు.

ఎక్స్ ఏఐ చాట్బోట్ అయిన గ్రోక్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. శృతి హాసన్ మ్యాచ్కు హాజరైందనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ఏఐ జనరేటేడ్ పిక్ అని స్పష్టం చేసింది. వైరల్ అయిన ఫొటోలను నిశితంగా పరిశీలించిన ఈ విషయం స్పష్టమవుతుంది. ఆర్సీబీ, సీఎస్కే ఐపీఎల్ మ్యాచ్కు హాజరైన పిక్ను ఏఐ సాయంతో మార్చారనే విషయం అర్థమవుతుంది. శృతి హాసన్ వెనుక కూర్చున్న వారు సీఎస్కే జెర్సీలో కనిపిస్తున్నారు.

ఈ మ్యాచ్లో టీమిండియా 76 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 63) హాఫ్ సెంచరీతో రాణించగా.. డెవాల్డ్ బ్రెవిస్(29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 45), ట్రిస్టన్ స్టబ్స్(24 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 44 నాటౌట్) దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(3/15) మూడు వికెట్లతో సత్తా చాటగా.. అర్ష్దీప్ సింగ్(2/28) రెండు వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తీ, శివమ్ దూబే చెరో వికెట్ తీసారు.
అనంతరం టీమిండియా 18.5 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. శివమ్ దూబే(37 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 42 నాటౌట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్(4/22) నాలుగు వికెట్లు, కేశవ్ మహరాజ్(3/24) మూడు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించారు. కార్బిన్ బోష్ రెండు వికెట్లు తీయగా.. ఎయిడెన్ మార్క్రమ్ ఒక వికెట్ పడగొట్టాడు.