ఆసియా కప్ 2025 టోర్నీకి రంగం సిద్దమైంది. మరికొద్ది క్షణాల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. అయితే ఈ టోర్నీ ప్రారంభానికి ముందు జరిగిన కెప్టెన్ల సమావేశంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు ఈ టోర్నీలో ఆడే 8 జట్ల సారథులు పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చారు. అయితే ఈ సమావేశంలో అందరి దృష్టి భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు పాకిస్థాన్ సారథి సల్మాన్ అలీ అఘాలపైనే నెలకొంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మీడియా ప్రతినిధులు ఈ ఇద్దరికి ప్రశ్నల వర్షం కురిపించారు.
సమావేశం ముగిసిన అనంతరం 8 జట్ల కెప్టెన్లు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీకి కూడా ఆటగాళ్లంతా షేక్ హ్యాండ్ ఇచ్చారు. అయితే పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు సూర్యకుమార్ యాదవ్ నిరాకరించాడని కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేశారు. కొన్ని జాతీయ వెబ్సైట్స్ కూడా ఈ వార్తలను పబ్లిష్ చేశాయి.

కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదు. భారత్, పాక్ కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. అయితే స్టేజీపై కాకుండా దిగే క్రమంలో సూర్య, సల్మాన్ అలీ అఘా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. మీడియా సమావేశం ముగిసిన వెంటనే సల్మాన్ అలీ అఘా స్టేజి దిగగా.. మిగతా ఆటగాళ్లు అక్కడే ఉండి సూర్యకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇది గమనించి సల్మాన్.. స్టేజి దిగుతున్న సూర్యకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. పాక్ కెప్టెన్తో సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్కు నిరాకరించాడనే ప్రచారం అవాస్తవం.
ఆసియా కప్ 2025 కోసం అన్ని విధాల సిద్దమయ్యామని సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. సంజూ శాంసన్ గురించి ఎవరూ దిగులు చెందాల్సిన అవసరం లేదని, అతన్ని తాము చూసుకుంటామని కూడా పేర్కొన్నాడు. పాక్తో మ్యాచ్ నేపథ్యంలో ఆటగాళ్లకు ఎలాంటి సూచనలు చేయలేదని, దూకుడు విషయంలో తగ్గేదేలే అని స్పష్టం చేశాడు. ఈ టోర్నీ కోసం ఉత్సాహంగా ఉన్నట్లు పేర్కొన్నాడు.