IND vs PAK: కొట్టుకున్న భారత్, పాక్ ఆటగాళ్లు?(వీడియో)
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా శుభారంభం చేసింది. దాయాదీ పాకిస్థాన్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు 64 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో భారత్ దుమ్మురేపింది. మరోవైపు పాకిస్థాన్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది.
అయితే ఈ మ్యాచ్కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, పాకిస్థాన్ బౌలర్ ఫాతిమా సనా కొట్టుకున్నట్లుగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ఛల్ చేస్తోంది. హర్మన్ప్రీత్ కౌర్పై దూసుకొచ్చిన పాక్ బౌలర్ ఫాతిమా నోటికి పనిచెప్పగా.. ఆగ్రహంతో ఊగిపోయిన హర్మన్ ప్రీత్ కౌర్ ఆమె మెడపట్టుకొని నెట్టేయగా.. ఇతర ఆటగాళ్లంతా దూసుకొచ్చారు. అంపైర్లు జోక్యం చేసుకొని ఆటగాళ్లకు సర్ది చెప్పినట్లుగా ఈ వీడియో ఉంది.
ఫేక్ వీడియో..
అయితే ఇది ఫేక్ వీడియో అని తేలింది. కొందరు ఆకతాయిలు కావాలనే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)సాయంతో ఈ వీడియోను సృష్టించారు. ఈ వీడియోను నిశితంగా పరిశిలిస్తేనే ఈ విషయం అర్థమవుతోంది. ఈ వీడియోలోని స్కోర్ కార్డ్స్తో పాటు భారత ఆటగాళ్లు పరుగెత్తుకురావడం వంటి సీన్స్ ఇది నకిలీ వీడియో అని స్పష్టం చేస్తున్నాయి. ఫ్యాక్ట్ చెక్లో కూడా ఇది ఫేక్ వీడియో అని తేలింది.

అయితే ఇది ఫేక్ వీడియో అని తెలియని నెటిజన్లు నిజమేనని పొరబడి కామెంట్స్ చేస్తున్నారు. పాక్ ఆటగాళ్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. భారత్, పాక్ మధ్య ఉన్న వైరాన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు ఆకతాయిలు ఈ వీడియోను సృష్టించారు. అయితే నిన్న జరిగిన మ్యాచ్లో ఆటగాళ్ల మధ్య ఎలాంటి గొడవ జరగలేదు.
నో షేక్ హ్యాండ్..
కాకపోతే నో షేక్ హ్యాండ్ సంప్రదాయాన్ని భారత మహిళా క్రికెటర్లు కూడా కొనసాగించారు. మ్యాచ్ ఆరంభ సమయంలో.. పూర్తయిన తర్వాత పాక్ ఆటగాళ్లకు ఎలాంటి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాక్ ఆటగాళ్లకు భారత్ షేక్ హ్యాండ్ ఇవ్వని సంగతి తెలిసిందే.
పురుషుల ఆసియాకప్ 2025 టోర్నీలో మొదలైన ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆరంభంలో ఈ వ్యవహారంపై గగ్గోలు పెట్టిన పాక్ ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. ఆట ఏదైనా.. వేదిక మరేదైనా.. పాక్ ఆటగాళ్లకు భారత్ అథ్లెట్స్ షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదు.
మెరిసిన స్మృతి, దీప్తి
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసింది. స్మృతి మంధాన(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 68) హాఫ్ సెంచరీతో రాణించగా.. హర్మన్ప్రీత్ కౌర్(35 బంతుల్లో 4 ఫోర్లతో 36), రిచా ఘోష్(17 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 34) పర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో సదియా ఇక్బాల్, ఫాతిమా సనా రెండేసి వికెట్లు తీయగా.. తస్మియా రుబాబ్, రమీన్ షమీమ్ తలో వికెట్ తీసారు.
అనంతరం పాకిస్థాన్ 17 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. మునీబా అలీ(35 బంతుల్లో 5 ఫోర్లతో 41) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ(5/10) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. తెలుగుతేజం శ్రీచరణి(3/21) తీన్మార్ బౌలింగ్తో అదరగొట్టింది. షెఫాలీ వర్మకు ఒక వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

