8 నెలల సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్ ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా గురువారం ప్రారంభమైన తొలి టెస్ట్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. 6 బంతుల్లో 6 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు.
హసన్ మహ్ముద్ వేసిన ఔట్సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరినీ వెంటాడుతూ వికెట్ కీపర్ లిటన్ దాస్ చేతికి చిక్కాడు. మరోసారి తన బలహీనతను బయటపెట్టుకున్నాడు. అయితే విరాట్ కోహ్లీ ఔటవ్వడంపై చెన్నై అభిమానులు సంతోషం వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ కొంతమంది నెటిజన్లు చెన్నై అభిమానులను తప్పుబడుతున్నారు. ఐపీఎల్ 2024 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ సంచలన విజయంతో రన్రేట్ను మెరుగుపరుచుకొని ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది.

ఈ విజయాన్ని ఆర్సీబీ అభిమానులు టైటిల్ గెలిచినంత రీతిలో సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ సంబరాలు చెన్నై అభిమానులను తీవ్ర బాధించాయి. అంబటి రాయుడు వంటి ఆటగాళ్లు కూడా ఈ సంబరాలను తట్టుకోలేక ఆర్సీబీపై విమర్శలు గుప్పించాడు. అయితే ఫస్టాఫ్ సీజన్లో వరుస పరాజయాలతో చతికిలపడిన ఆర్సీబీ.. సెకండాఫ్లో సంచలన ప్రదర్శనతో అనూహ్యంగా ప్లే ఆఫ్స్ చేరడంతో ఆ జట్టు అభిమానుల సంతోషానికి హద్దే లేకుండా పోయింది.
ఈ క్రమంలోనే ఆర్సీబీ, విరాట్ కోహ్లీపై కొంతమంది సీఎస్కే అభిమానులు కోపం పెంచుకున్నారు. ఆ జట్లు ప్లే ఆఫ్స్ ఓడినప్పుడు సంబరాలు చేసుకున్నారు. అయితే తాజా టెస్ట్లో కోహ్లీ ఔటైన వెంటనే బిగ్గరగా అరుస్తూ చెన్నై అభిమానులు సంబరాలు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఇది వాస్తవం కాదు. ఐపీఎల్ వరకు కోహ్లీని వ్యతిరేకించినా.. టీమిండియా స్టార్ బ్యాటర్గా అతన్ని చెన్నై ఫ్యాన్స్ అభిమానిస్తారు.
విరాట్ కోహ్లీ ఔటైన అనంతరం కూడా వారు నిరాశకు గురయ్యారు. అదే సమయంలో రిషభ్ పంత్ మైదానంలోకి వస్తుండటంతో బిగ్గరగా అరిచారు. రోడ్డు ప్రమాదంతో రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పంత్ రెడ్ బాల్ క్రికెట్ ఆడుతుండటంతో అతనికి స్వాగతం పలుకుతూ గట్టిగా అరిచారు. అంతేతప్పా కోహ్లీ ఔటయ్యాడని కాదు. కానీ కొంతమంది నెటిజన్లు ఉద్దేశపూర్వకంగా కోహ్లీని చెన్నై ఫ్యాన్స్ ఎగతాళి చేస్తున్నారంటూ కామెంట్స్ చేశారు.