టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి వన్డే సారథ్య బాధ్యతలు చేపట్టబోతున్నాడా? టీ20 జట్టు నుంచి తప్పించిన శుభ్మన్ గిల్ వన్డే కెప్టెన్సీపై వేటు పడనుందా? అంటే సోషల్ మీడియాలో అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఏడాదే కెప్టెన్గా రోహిత్ శర్మ ప్రయాణానికి తెరదించుతూ.. కొత్త కెప్టెన్గా శుభ్మన్ గిల్ను బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే.
ఆస్ట్రేలియా పర్యటనతో శుభ్మన్ గిల్ వన్డే కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. వన్డే ప్రపంచకప్ 2027 నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని అప్పట్లో సెలెక్టర్లు వివరణ ఇచ్చారు. వన్డే ప్రపంచకప్ 2027 వరకు కోహ్లీ, రోహిత్ జట్టులో కొనసాగడంపై సందేహాలు వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే కొత్త సారథిని సిద్దం చేయాలనుకున్నామని చెప్పారు. శుభ్మన్ గిల్కు వన్డే సారథ్య బాధ్యతలు అప్పగించారు. అయితే శుభ్మన్ గిల్ ఇటీవల పేలవ ఫామ్తో పాటు ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. దాంతో అతను టీ20 ప్రపంచకప్ 2026 ఎంపిక చేయలేదు. టీమ్ కాంబినేషన్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. ముఖ్యంగా మిడిలార్డర్ను బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు.

ఈ క్రమంలో ఓ సోషల్ మీడియా పోస్ట్ నెటిజన్లలో గందరగోళం స్పృష్టించింది. రోహిత్ శర్మను తిరిగి భారత వన్డే సారథిగా నియమించేందుకు బీసీసీఐ సిద్దమైందని, ఇప్పటికే ఈ విషయమై రోహిత్ శర్మతో మాట్లాడిందని ఆ పోస్ట్లో పేర్కొన్నారు. వన్డే ప్రపంచకప్ 2027లో టీమిండియాను రోహిత్ శర్మనే నడిపించబోతున్నాడని పేర్కొన్నారు. 'కెప్టెన్ రోహిత్ శర్మ ఈజ్ బ్యాక్. సెలెక్టర్లు అతనితో మాట్లాడుతున్నారు. ప్రపంచకప్ నేపథ్యంలో వన్డే సారథ్య బాధ్యతలు చేపట్టాలని కోరుతున్నారు.'అని ఆ పోస్ట్లో తెలిపారు.
ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ముఖ్యంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఇది నిజమేనని భావించి వైరల్ చేస్తున్నారు. ఈ పోస్ట్కు ఇప్పటికే లక్షా 20వేల వ్యూస్ వచ్చాయి. కానీ ఇది ఫేక్ ఫోస్ట్. రోహిత్ శర్మకు తిరిగి కెప్టెన్సీ ఇచ్చే విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇప్పటి వరకు నమ్మదగిన మూలాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించలేదు. భారత వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్ కొనసాగనున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారత వన్డే టీమ్లో భాగంగా ఉండనున్నారు.
టీ20, టెస్ట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లీ కేవలం వన్డే ఫార్మాట్లోనే కొనసాగుతున్నారు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ సూపర్ ఫామ్లో ఉన్నారు. విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లీ, రోహిత్ సెంచరీలతో చెలరేగారు. న్యూజిలాండ్తో జనవరి 11 నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్లో బరిలోకి దిగనున్నారు.