ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా చావోరేవో మ్యాచ్కు సిద్దమైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం జరిగే తమ ఆఖరి సూపర్-8 పోరులో వెస్టిండీస్తో అమీతుమీ తేల్చుకోనుంది.
ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుకే గ్రూప్-1 నుంచి సెమీస్ బెర్త్ దక్కనుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. దాంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు క్వార్టర్ ఫైనల్లా మారింది. గ్రూప్-1 నుంచి ఇప్పటికే సౌతాఫ్రికా సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిన జింబాబ్వే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
వెస్టిండీస్ను ఏ మాత్రం లైట్ తీస్కున్నా టీమిండియా మూల్యం చెల్లించుకుంటుందని క్రికెట్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఈ టోర్నీలో వెస్టిండీస్ అసాధారణ ప్రదర్శన కనబర్చింది. సౌతాఫ్రికా చేతిలో ఓడినా ఆ జట్టు పవర్ఫుల్గానే ఉంది. నిలకడలేమి విండీస్ బలహీనత అయినప్పటికీ.. తమదైన రోజున ఎంత పెద్ద జట్టునైనా మట్టికరిపిస్తోంది.

జింబాబ్వేతో మ్యాచ్లో భారత బౌలింగ్ లుకలుకలు బయటపడ్డాయి. వెస్టిండీస్తో పోరుకు ముందు టీమిండియా తమ బౌలింగ్ బలహీనతలను అధిగమించాలి. లేదంటే విండీస్ విధ్వంసకర బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెస్టిండీస్ను 200 పరుగులు మార్క్ అందుకోకుండా చూడాలి. లేదంటే ఆ జట్టు ఈజీగా 220 రన్స్ చేస్తుంది. బ్రాండన్ కింగ్, షైహోప్, షిమ్రన్ హెట్మైర్, రోవ్మన్ పోవెల్ సూపర్ ఫామ్లో ఉన్నారు.
మరోవైపు భారత బ్యాటింగ్ లైనప్ పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతుంది. అభిషేక్ శర్మ ఫామ్ కోల్పోయి సతమతమవుతుంటే.. సంజూ శాంసన్ భారీ ఇన్నింగ్స్లు ఆడలేకపోతున్నాడు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు.
అంతేకాకుండా భారత్, వెస్టిండీస్ మ్యాచ్ చిన్నమైదానమైన ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. ఈ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. వెస్టిండీస్కు ఈ మైదానం సరిగ్గా సరిపోతుంది. ఈ క్రమంలోనే టీమిండియా తమ లోపాలను సరిదిద్దుకొని బరిలోకి దిగాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించి 2016 టీ20 ప్రపంచకప్ 2016 సెమీఫైనల్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.