ఐపీఎల్ 2024 సీజన్ తుది దశకు చేరింది. మరో రెండు రోజుల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్కు తెరపడనుంది. మరికాసేపట్లో సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో కేకేఆర్తో తలపడనుంది. గత రెండు నెలల పాటు ఐపీఎల్ అభిమానులకు కావాల్సిన మజాను అందించింది.
అయితే ఈ సారి అభిమానుల మధ్య దూరం కూడా బాగా పెరిగింది. క్రికెట్ను మతంలా భావించే భారత్లో ఐపీఎల్ సక్సెస్ కావడానికి ప్రధాన కారణం ఫ్యాన్స్. అయితే ఆ ఫ్యాన్స్ ఇప్పుడు ఐపీఎల్ కారణంగా గ్రూప్లుగా విడిపోయి కొట్టుకుంటున్నారు. ఒకప్పుడు టీమిండియా అభిమానినంటూ కాలర్ ఎగిరేసిన సగటు క్రికెట్ ప్రేక్షకుడు.. ఇప్పుడు ఆర్సీబీ, సీఎస్కే, ముంబై ఇండియన్స్ అంటూ ఆయా టీమ్స్పై ప్రేమను చూపిస్తున్నాడు.

వ్యక్తిగత పూజ ఎక్కువైంది..
గతంలో కంటే ఈ పిచ్చి ఈసారి చాలా ఎక్కువైంది. ఫ్రాంచైజీలతో పాటు ఆటగాళ్లను ప్రేమించడం కూడా ఎక్కువైంది. ముంబై ఇండియన్స్ సారథ్యాన్ని రోహిత్ శర్మకు కాదని హార్దిక్ పాండ్యాకు ఇవ్వడంపై ఆ జట్టు అభిమానులు ఎలా స్పందించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ అనే విషయాన్ని మరిచి హార్దిక్ పాండ్యాను ఎగతాళి చేశారు.
అభిమానుల ఒక ఎత్తు అయితే ఈ సారి కామెంటేటర్లు కూడా దిగజారి ప్రవర్తించారు. వార్తల్లో నిలవాలనే తపనో లేక సొంత జట్టుకు మద్దతు తెలుపాలనే పైశాచికత్వమో తెలియదు కానీ.. హద్దులు ధాటి మాట్లాడారు. తమ వ్యాఖ్యానంతో అభిమానుల మధ్య అగ్గిని రాజేశారు.
కామెంటేటర్లు సైతం..
ఈ సీజన్ మొత్తం టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. హార్దిక్ పాండ్యాపై నోరు పారేసుకున్నాడు. ప్రతీ విషయాన్ని పెద్దదిగా చూస్తూ హార్దిక్ పాండ్యాపై విమర్శలు గుప్పించాడు. దిగ్గజ కామెంటేటర్ అయిన సునీల్ గవాస్కర్ కూడా ఛాన్స్ దొరికిన ప్రతీసారి విరాట్ కోహ్లీపై విమర్శలు గుప్పించాడు.
పదే పదే అతని స్ట్రైక్రేట్ను ప్రస్తావిస్తూ.. తక్కువ చేసే ప్రయత్నం చేశాడు. దీనికి కోహ్లీ కూడా ఘాటుగానే స్పందించాడు. ఓ దశలో కోహ్లీని టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయవద్దనే చర్చ కూడా చేశారు. కానీ ఈ విమర్శలకు విరాట్ కోహ్లీ బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా నిలిచి అందరి నోర్లు మూయించాడు.
చిన్నపిల్లాడిలా రాయుడు..?
తెలుగు తేజం అంబటి రాయుడు అయితే చిన్నపిల్లాడిలా మాట్లాడుతూ.. ఆర్సీబీ అభిమానులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. విరాట్ కోహ్లీపై అతనికి ఉన్న వ్యక్తిగత కక్షనో? లేక చెన్నై సూపర్ కింగ్స్ను ప్లే ఆఫ్స్ చేరకుండా ఆర్సీబీ అడ్డుకుందనో..? తెలియదు కానీ.. రాయుడు విషం కక్కుతున్నాడు.
చెన్నైని ఓడించిన మరుక్షణం నుంచి ఆర్సీబీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాడు. తన కామెంట్రీతో పాటు సోషల్ మీడియా వేదికగా ఆర్సీబీ జట్టును, ఆటగాళ్లను తప్పుబడుతూ అభిమానులను రెచ్చగొడుతున్నాడు. ఈ క్రమంలో కామెంటేటర్లపై రియల్ క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది భారత క్రికెట్కు ఏ మాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.