టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా కీలక పోరుకు సిద్దమైంది. సూపర్-8లో భాగంగా అఫ్గానిస్థాన్తో బార్బోడస్ వేదికగా గురువారం జరిగే మ్యాచ్లో అమీతుమీ తేల్చుకోనుంది. అమెరికా వేదికగా జరిగిన గ్రూప్ దశ మ్యాచ్ల్లో హ్యాట్రిక్ విజయం సాధించి సూపర్-8కు అర్హత సాధించిన టీమిండియా.. గ్రూప్-1లో ఆస్ట్రేలియా, అఫ్గాన్, బంగ్లాదేశ్తో పోటీ పడనుంది.
బ్యాటింగ్కు కష్టంగా ఉన్న అమెరికా పిచ్లపై లీగ్ దశ మ్యాచ్లు ఆడిన టీమిండియా.. అందుకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండే వెస్టిండీస్ పిచ్లపై సూపర్ 8 మ్యాచ్లను ఆడనుంది.

కరేబియన్ పిచ్లు స్పిన్కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో టీమిండియా తుది జట్టులో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. టీమిండియా నలుగురు స్పిన్నర్లతో ఆడే అవకాశం ఉందని రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్లు హింట్ ఇవ్వగా.. ఓపెనర్గా యశస్వి జైస్వాల్ కూడా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
కానీ మాజీ క్రికెటర్, కామెంటేటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మాత్రం టీమిండియా ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుందని చెప్పాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వస్తాడని చెప్పిన శ్రీకాంత్.. స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఉద్వాసనకు గురవుతాడని అభిప్రాయపడ్డాడు. ఈ ఒక్క మార్పు మినహా టీమిండియా కాంబినేషన్లో ఎలాంటి మార్పు ఉండదని చెప్పాడు.
'నేనే కెప్టెన్ అయితే కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకుంటా. అతని కోసం మహమ్మద్ సిరాజ్ను పక్కనపెడుతా. మణికట్టు స్పిన్నర్లు మ్యాచ్ విన్నర్లు. ఆస్ట్రేలియా జట్టులో ఆడమ్ జంపా, సౌతాఫ్రికాలో టబ్రైజ్ షంసీ ప్రదర్శనలను చూస్తే ఈ విషయం అర్థమవుతోంది.'అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.
కృష్ణమాచారి శ్రీకాంత్ భారత తుది జట్టు(అంచనా) వర్సెస్ అఫ్గానిస్థాన్:
రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్