
కరాచీ: భారత్, పాకిస్థాన్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లను తిరిగి పునరుద్ధరించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ ఛైర్మన్ జాకా అష్రాఫ్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని కోరాడు. జిన్నా-గాంధీ పేరిట సిరీస్ను నిర్వహిస్తే ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతమవుతాయన్నాడు. ఇక భారత్-పాక్ మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాల కారణంగా పాకిస్థాన్తో క్రికెట్ ఆడకుండా భారత ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. దీంతో గత కొద్ది కాలంగా ఇరు దేశాల మధ్య రాజకీయ సంబంధాలతో పాటు క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్నాయి.
రానున్న రోజుల్లోనూ దాయాది దేశంతో క్రికెట్ ఆడే పరిస్థితులు కనిపించట్లేదు. ఈ రెండు దేశాలు చివరిసారిగా 2019 ప్రపంచకప్లో తలపడ్డాయి. దీంతో అష్రాఫ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. 'నా పదవీకాలంలో జిన్నా-గాంధీ పేరుతో సిరీస్ను ప్రారంభించడానికి ప్రయత్నించాను. ఈ విషయాన్ని బీసీసీఐకి కూడా తెలిపాను. ఉగ్రవాద అంశాల కారణంగా భారత్ ఈ విషయంలో వెనక్కి తగ్గింది. జిన్నా-గాంధీ పేరుతో సిరీస్ ప్రారంభిస్తే.. ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు బలోపేతమవుతాయి. ఇది మరో యాషెస్ సిరీస్లా మారుతుంది" అని అష్రాఫ్ పేర్కొన్నారు.
అష్రాఫ్ కాలంలోనే ఇరు దేశాలు చివరి ద్వైపాక్షిక సిరీస్ను ఆడాయి. భారత్ ద్వైపాక్షిక సిరీస్లకు తటస్థ వేదికలు మేలని కూడా అఫ్రాఫ్ అభిప్రాయపడ్డాడు. శ్రీలంక, యూఏఈ, సౌతాఫ్రికా వంటి దేశాల్లో సిరీస్లను నిర్వహిస్తే బాగుంటుందని తెలిపాడు. ఐసీసీ తెచ్చిన ఎఫ్టీపీ నిబంధన కూడా పాకిస్థాన్తో, భారత్ క్రికెట్ ఆడకపోవడానికి మరో కారణమని పేర్కొన్నాడు. ఇక భారత్-పాక్ మధ్య 2007లో చివరి సారిగా టెస్టు సిరీస్ జరగ్గా.. 2012-13 మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అప్పటి నుంచి ఆసియా కప్, ఐసీసీ టోర్నమెంట్లలో తప్పితే రెండు దేశాల మధ్య ఎటువంటి సిరీస్లు జరగలేదు.