వెల్లింగ్టన్ : టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెస్సన్ ఓ సలహా ఇచ్చాడు. తాను చెప్పినట్లు చేస్తే కివీస్ గడ్డపై హిట్మ్యాన్కు తిరుగుండదన్నాడు. భారత్-న్యూజిలాండ్ సిరీస్లో భాగంగా రోహిత్ Vs ట్రెంట్ బోల్డ్ పోరు అభిమానులను కనువిందు చేస్తుందని తెలిపాడు. ఓ జాతీయ చానెల్తో మాట్లాడుతూ.. పేస్కు అనుకూలంగా ఉండే కివీస్ పిచ్లపై రోహిత్.. తన దూకుడును నియంత్రించుకొని ఓపిగ్గా ఆడాలని ఈ మాజీక్రికెటర్ కమ్ కోచ్ సూచించాడు. ముఖ్యంగా టెస్ట్ల్లో ఇది చాలా అవసరమని నొక్కి చెప్పాడు.
'టెస్ట్ల్లో ఫస్ట్ సెషన్ ముగిసే వరకు రోహిత్ నిదానంగా ఆడాలి. బంతిని ఏ మాత్రం హిట్ చేయకూడదు. ఇలా చేస్తేనే కివీస్ గడ్డపై అతను బ్యాటింగ్ను ఆస్వాదించగలడు.'అని ఈ స్టార్ క్రికెటర్ సూచించాడు.
భళా యువ భారత్.. మీ క్రీడా స్పూర్తికి సలామ్
'ట్రెంట్ బౌల్ట్ vs రోహిత్ శర్మ మధ్య ఆధిపత్య పోరు కచ్చితంగా సిరీస్ మజాని పెంచుతుంది. కాకపోతే.. ఇక్కడి పిచ్లు స్వింగ్కి అనుకూలిస్తాయి కాబట్టి.. అది బౌల్ట్కి కలిసిరానుంది. ఇక న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాట్స్మెన్లు భారత మణికట్టు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ని ఎలా ఎదుర్కొంటారు..? అనేది కూడా కీలకం. బౌల్ట్ కనీసం వన్డే సిరీస్కైనా వస్తాడని ఆశిస్తున్నాం' అని హసన్ వెల్లడించాడు. చేతి వేలి గాయం కారణంగా ట్రెంట్ బౌల్ట్ టీ20 సిరీస్కి దూరమయ్యాడు. ఫిబ్రవరి 5 నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది.
'ఇక న్యూజిలాండ్ను సొంతగడ్డపై ఓడించడం చాలా కష్టం. ఇటీవల రికార్డులు కూడా ఇదే చెబుతున్నాయి. అయితే గతంలో కంటే భారత్ బలమైన జట్టుతో బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా అద్భుతమైన పేసర్లతో ఆడనుంది. దీంతో ఈ సిరీస్ మరింత రసవత్తరంగా జరగనుంది.'అని ఈ మాజీ కోచ్ తెలిపాడు. ఇక పాండ్యా గైర్హాజరీ యువ ప్లేయర్ శివమ్ దూబేకు మంచి అవకాశమని, ఈ సిరీస్లో తన సత్తా ఏంటో నిరూపించుకుంటే టీ20 వరల్డ్కప్ బెర్త్ దక్కుతుందన్నాడు.
న్యూజిలాండ్ టీమ్ కోచ్గా తప్పుకున్న మైక్ హెసన్ టీమిండియా హెడ్కోచ్ పదవిపై కన్నేశాడు. రవిశాస్త్రి టర్మ్ ముగిసిన తర్వాత ఆ బాధ్యతలను అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టిన మైక్.. ప్రస్తుతం క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్గా వ్యవహరిస్తున్నాడు.