న్యూఢిల్లీ: ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి దూకుడు ఎక్కువని, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అలా కాదని అందరంటూ ఉంటారని, కానీ అది అవాస్తవమని మాజీ సెలెక్టర్ గగన్ ఖోడా అన్నారు. విరాట్లా ధోనీకి కూడా దూకుడు ఎక్కువేనని, కాకపోతే అది మాటల్లో కనిపించకుండా జాగ్రత్తపడేవాడని తాజాగా స్పోర్ట్స్ కీదాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. భారత సెలెక్టర్గా ధోనీ నాయకత్వాన్ని దగ్గరగా చూసిన గగన్ ఖోడా.. మహీకి ఎప్పుడు దూకుడుగా వ్యవహరించాలో మరెప్పుడూ తగ్గి ఉండాలో బాగా తెలుసన్నాడు.
'విరాట్ కోహ్లీకి దూకుడు ఎక్కువని, ధోనీకి అలా కాదని అందరూ అంటారు. కానీ నేను మాత్రం దీన్ని నమ్మను. దూకుడనేది మాటల్లో కనిపించేది కాదు. ధోనీ దూకుడుగా ఉంటూనే సేఫ్గా ఉండేవాడు. విరాట్ దూకుడుగా ఉంటాడు కానీ సురక్షితంగా ఉండటం ఎలానో తెలియాదు. అది నేర్చుకుంటున్నాడు. అతను ఏదైనా చాలా త్వరగా నేర్చుకుంటాడు. ధోనీ దూకుడు మాటల్లో కనిపించదు..కానీ విరాట్తో సమానంగా అగ్రెసివ్గా ఉంటాడు. ఎప్పుడూ దూకుడుగా ఉండటం మంచిది కాదు. దూకుడు కనబరుస్తూనే సురక్షితంగా ఉండటం ముఖ్యం. ధోనీ రెండింటిని సమన్వయం చేసేవాడు. విరాట్ దాన్ని నేర్చుకుంటున్నాడు.'అని ఈ మాజీ సెలెక్టర్ చెప్పుకొచ్చాడు.
భారత క్రికెట్లో ధోనీ అత్యంత విజయవంతమైన సారథి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అతను సాధించిన విజాయాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. తన సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వరల్డ్ కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీలు అందించిన మహీ.. మూడు ఐసీసీ టైటిళ్లు అందించి ఏకైక సారథిగా రికార్డు సృష్టించాడు. ఇక 2014లో టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో తొలిసారి విరాట్ జట్టు పగ్గాలు అందుకోగా.. 2017లో పూర్తి స్థాయి కెప్టెన్గా మారాడు. కానీ ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయాడు. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చేరిన భారత్.. గతేడాది జరిగిన ప్రపంచకప్లో సెమీస్లో నిష్క్రమించింది.