పాకిస్థాన్ క్రికెట్ టీమ్పై భారత మాజీ స్పిన్నర్ మురళీ కార్తీక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ జట్టు కంటే ప్లే స్కూల్ పిల్లలు నమయమని అసహనం వ్యక్తం చేశాడు. ఆసియా కప్ 2025లో భాగంగా యూఏఈతో మ్యాచ్కు ముందు పాకిస్థాన్ బాయ్కట్ డ్రామాకు తెరలేపింది. నిర్ణీత సమయానికి మైదానానికి రాకుండా టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు లీకులు ఇచ్చింది. భారత్తో మ్యాచ్లో షేక్ హ్యాండ్ వివాదానికి కారణమైన రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్పై ఐసీసీ చర్యలు తీసుకోకపోవడంపై పీసీబీ అసంతృప్తిని వ్యక్తం చేసింది.
యూఏఈతో మ్యాచ్కు అతన్నే మ్యాచ్ రిఫరీగా నియమించడంతో ఆగ్రహానికి గురైన పీసీబీ.. టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు బెదిరింపులకు పాల్పడింది. ఆ కాసేపటికే మ్యాచ్ రిఫరీ క్షమాపణ చెప్పాడని, మ్యాచ్ ఆడుతామని ప్రకటించింది. ఈ హైడ్రామా కారణంగా మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. పాకిస్థాన్ జట్టు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై మాట్లాడిన మురళీ కార్తీక్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

'మీరు ఓ నిర్ణయం తీసుకోవాలనుకుంటే మరో ఆలోచన లేకుండా తీసుకోవాలి. నా అభిప్రాయం ప్రకారం జీవితంలో ప్రతీ ఒక్కరికి ఒక వైఖరి ఉంటుంది. కానీ దానికి కట్టుబడి ఉండాలి. అందుకు ధైర్యం కూడా ఉండాలి. హ్యాండ్ షేక్ వివాదం గురించి టోర్నీ నుంచి తప్పుకుంటే 16 మిలియన్ల అమెరికా డాలర్ల ఆర్థిక నష్టం వస్తుందని తెలిసినప్పుడు.. ఆ నిర్ణయం తీసుకునే దమ్ము ఉండాలి. అంతేకానీ ఇలా సగం సగం చేయకూడదు. చివరకు ప్లే స్కూల్ పిల్లలు కూడా ఇలా చేయరు. పాక్ జట్టు ప్రవర్తన చాలా హాస్యాస్పదంగా ఉంది. సరైన కారణం లేకుండా ఎంతో మందిని ఇబ్బందుల్లోకి నెట్టారు.
మీ తీరు కారణంగా మ్యాచ్ గంట ఆలస్యమవుతోంది. మీ వల్ల పాకిస్థాన్లోని ప్రజలు కూడా ఇబ్బంది పడుతారు. తమ హీరోలు ఆడటం చూడాలనుకున్న పాకిస్థాన్ చిన్నారులు.. అర్థరాత్రి వరకు మెలకువగా ఉండాలి. అంత రాత్రి వరకు మ్యాచ్ చూస్తే వారు ఉదయం స్కూల్కు ఎలా వెళ్లాలి?'అని మురళీ కార్తీక్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.