ఐపీఎల్ 2022 సీజన్కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ను రూ. 7090 కోట్లకు కొనుగోలు చేసినందుకు అందరూ తనను పిచ్చోడిలా చూశారని ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా అన్నారు. కానీ ప్రస్తుతం ఆ జట్టు విలువ రూ. 13,147 కోట్లకు చేరిందని చెప్పారు. ది హండ్రెడ్ లీగ్లో కూడా తాను కొనుగోలు చేసిన ఫ్రాంచైజీ విలువ ఇలానే పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఐపీఎల్ 2022 సీజన్కు ముందు బీసీసీఐ కొత్త రెండు జట్ల కోసం టెండర్లు ఆహ్వానించగా.. సంజీవ్ గోయెంకా రూ. 7090 కోట్లకు బిడ్ వేసి లక్నో టీమ్ను దక్కించుకున్నాడు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ను సీవీసి క్యాపిటల్స్ అనే సంస్థ రూ. 5,625 కోట్లకే కొనుగోలు చేసింది. లక్నో అదనంగా రూ. 1500 కోట్లు ఖర్చు చేయడంపై అప్పట్లో చాలా మంది విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత నాలుగు సీజన్లు ఆడిన లక్నో.. రెండు సార్లు ప్లేఆఫ్స్ చేరింది. అనంతం సంజీవ్ గోయెంకా తన ఫ్రాంచైజీ సామ్రాజ్యాన్ని విస్తరించారు. సౌతాఫ్రికా 20 లీగ్లో డర్బన్ సూపర్ జెయింట్స్, హండ్రెడ్ లీగ్ మాంచెస్టర్ ఒరిజనల్స్ జట్టును కొనుగోలు చేశారు. ఫుట్బాల్ లీగ్లోనూ సంజీవ్ గోయెంకా పెట్టుబడి పెట్టారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో గోయెంకా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

'ఐపీఎల్లో లక్నో జట్టును రూ. 7090 కోట్లకు కొనుగోలు చేసినప్పుడు ఈ ప్రపంచం నన్ను పిచ్చోడిలా చూసింది. కానీ మూడేళ్లలో ఆ జట్టు విలువ రూ. 13,147 కోట్లకు పెరిగింది. ఐపీఎల్ వంటి టోర్నీ ప్రపంచంలో మరెక్కడా లేదు. హండ్రెడ్ లీగ్ కూడా ఇదే విధంగా ఆదరణ పొందుతుంది. ఆ నమ్మకం నాకుంది. ఇది కేవలం క్రీడతోనే కాకుండా, ఫార్మాట్తో పాటు ముఖ్యంగా జట్టుతో ఒక మానసిక బంధాన్ని ఏర్పరుచుకోవడం. అయితే ఇది రాత్రికి రాత్రి జరగదు. ఐపీఎల్ ఈ స్థాయికి చేరుకోవడానికి 18 ఏళ్లు పట్టింది.'అని సంజీవ్ గోయెంకా చెప్పుకొచ్చాడు. ది హండ్రెడ్ లీగ్లోని మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టులోని 70 శాతం వాటాను రూ. 855 కోట్లకు సంజీవ్ గోయెంకా కొనుగోలు చేశారు. దాంతో ఆ జట్టు పేరును మాంచెస్టర్ సూపర్ జెయింట్స్గా మార్చనున్నారు.