బెంగళూరు : టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ గత కొంతకాలంగా గాయాలతో సతమతమవుతూ జట్టుకు దూరమయ్యాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో (ఎన్సీఏ)లో చికిత్స తీసుకొని రీ ఎంట్రీ ఇచ్చిన భవీకి గాయం మళ్లీ తిరగబెట్టింది. దీంతో అతను వచ్చినట్టే వచ్చి దూరమవ్వడం.. ఎన్సీఏలో ఉన్న సౌకర్యాలపై పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అయితే తాజాగా భువనేశ్వర్ కుమార్కు ఇంగ్లండ్లో హెర్నియా సర్జరీ జరిగిందని బీసీసీఐ ఓప్రకటనలో తెలిపింది. ఈ నెల 9న ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి అయిందని పేర్కొంది.
అతనికి తోడుగా టీమిండియా ఫిజియోథెరపిస్ట్ యోగేష్ పర్మార్ ఉన్నారని, త్వరలో భువనేశ్వర్ ఇండియాకు వచ్చి ఎన్సీఏలో చేరుతారని తెలిపింది. భారత్ తరఫున భువనేశ్వర్ కుమార్ ఇప్పటి వరకు 212 టెస్టులు, 114 వన్డేలు, 43 టీ20లు ఆడాడు. టెస్ట్ ఫార్మాట్లో 63 వికెట్లు, వన్డేల్లో 132, టీ20ల్లో 41 వికెట్లు సాధించాడు. భారత ప్రధాన బౌలర్లలో భువీ ఒకడు. ఇటీవలి కాలంలో భువీ తరచూ గాయాలపాలవుతున్నాడు.
పృథ్వీషా రెడీ..
2018 ఆస్ట్రేలియా పర్యటనలో గాయం.. ఆ తరువాత కాఫ్ సిరప్తో ఏడు నెలల నిషేధంతో వరుసగా ఇబ్బందులు పాలైన టీమిండియా సెన్సెషన్ పృథ్వీ షా.. రంజీ ట్రోఫీలో అద్భుత డబుల్ సెంచరీతో తన రీ ఎంట్రీ ఘనంగా చాటుకున్నాడు. ఈ ఫెర్ఫామెన్స్తో న్యూజిలాండ్ టూర్కు వెళ్లే ఇండియా-ఎ జట్టులో చోటుదక్కించుకున్నాడు. ఇక టూర్కు వెళ్లేదే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో రంజీ మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో న్యూజిలాండ్కు వెళ్లాల్సినోడు కాస్త బెంగళూరు ఎన్సీఏకు చేరాడు.
అయితే షా రిహబిలిటేషన్ పూర్తయిందని, అతను గాయం నుంచి కోలుకున్నాడని బీసీసీఐ తెలిపింది. అతని భుజం గాయం నయమైందని, అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని ప్రకటించింది. ఇక త్వరలోనే న్యూజిలాండ్కు కూడా బయలుదేరుతాడని, ఇండియా-ఎ జట్టుతో కలుస్తాడని స్పష్టం చేసింది.