
ఐపీఎల్ కోసమే ఈ నాటకం..
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మరోసారి నోరుపారేసుకున్నాడు. ఐపీఎల్ కాసుల కోసమే టీమిండియా.. కొవిడ్ను సాకుగా చూపిందనే విధంగా తన కాలమ్లో రాసుకొచ్చాడు. 'నిజాయితీగా చెప్పాలంటే ఇదంతా డబ్బు, ఐపీఎల్ కారణంగానే జరిగింది. ఆటగాళ్లలో కరోనా సోకుతుందేమోననే భయంతోపాటు ఐపీఎల్కు దూరమవుతామనే ఆందోళన వల్లే మాంచెస్టర్ టెస్టు రద్దయింది'అని వాన్ రాసుకొచ్చాడు.
అంతటితో ఆగకుండా ఐపీఎల్తో కాకుండా ఇతర కారణాలతో మాంచెస్టర్ టెస్ట్ రద్దయిందని చెప్పకండని ట్వీట్ చేశాడు. 'ఐపీఎల్ టీమ్స్ ప్రత్యేక విమానాల్లో తమ ఆటగాళ్లను తరలిస్తున్నాయి. ఆటగాళ్లు ఆరు రోజుల క్వారంటైన్లో ఉండాలి. లీగ్కు ఇంకా ఏడు రోజుల సమయం ఉంది. మాంచెస్టర్ టెస్ట్ రద్దుకు ఐపీఎల్ కాకుండా ఇతర కారణాలున్నాయని చెప్పకండి'అని వాన్ పేర్కొన్నాడు.
పనికిమాలిన హండ్రెడ్ లీగ్ కోసం..
ఇక ఇంగ్లండ్ మీడియా, మాజీ ఆటగాళ్ల విమర్శలకు భారత అభిమానులు ఘాటుగా బదులిస్తున్నారు. 'డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత భారత జట్టు నలభై రోజులు ఖాళీగా కూర్చుంది. టెస్టు సిరీస్ను కాస్త ముందుగా జరపమన్నా వినలేదు. పైగా పనికిమాలిన 'హండ్రెడ్' కోసం రెండో, మూడో టెస్టుల మధ్య 9 రోజుల విరామం ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు ఐపీఎల్ను విమర్శించడంలో అర్థం లేదు.'అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సిరీస్ను కొంచె ముందుకు జరిపినా.. రెండో, మూడో టెస్ట్ మధ్య విరామాన్ని తగ్గించిన ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. ఇక సౌతాఫ్రికా పర్యటనలో ఇంగ్లండ్ జట్టు చేసిందేంటని భారత మాజీ క్రికెట్ ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు. ఇంగ్లండ్ జట్టులో కరోనా కేసులు లేకున్నా.. ఎందుకు సిరీస్ బాయ్కట్ చేసిందని నిలదీశాడు.

ఏదైనా జరగవచ్చని...
శుక్రవారం నుంచి ఓల్డ్ట్రాఫోర్డ్ మైదానంలో జరగాల్సిన భారత్, ఇంగ్లండ్ చివరి టెస్టు అనూహ్యంగా రద్దయింది. గురువారం రాత్రి భారత క్రికెటర్లందరి కోవిడ్ రిపోర్టులు 'నెగెటివ్'గా వచ్చినా... మ్యాచ్ మధ్యలో ఏదైనా జరగవచ్చనే భయమే టీమిండియా ఆటగాళ్లను బరిలోకి దిగకుండా చేసింది. సహజంగానే కరోనా ప్రభావం కొంత ఆలస్యంగా కనిపించే అవకాశం ఉంది కాబట్టి ఆడకపోవడమే మంచిదని కోహ్లీ సేన భావించింది.
మ్యాచ్ జరగాల్సిన రోజు ఉదయం సుదీర్ఘ సమయం పాటు చర్చించాక ఇరు బోర్డులు టెస్టును రద్దు చేయాలని నిర్ణయించాయి. భారత జట్టు పూర్తి జట్టును బరిలోకి దింపే పరిస్థితిలో లేదని ఇంగ్లండ్ బోర్డు ప్రకటించగా... ప్లేయర్ల ఆరోగ్యభద్రతే తమకు అన్నింటి కంటే ముఖ్యమని బీసీసీఐ ప్రకటించింది.

తేలని సిరీస్ ఫలితం..
ఐదో టెస్టు రద్దుతో సిరీస్ ఫలితంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇంకా స్పష్టతనివ్వాల్సి ఉంది. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) నిబంధనల ప్రకారం కోవిడ్ కారణంగా మ్యాచ్ జరిగే అవకాశం లేకపోతే మ్యాచ్ను రద్దు చేయవచ్చు. అలా చూస్తే భారత్ 2-1తో సిరీస్ గెలుచుకున్నట్లే.
అయితే ఇంగ్లండ్ బోర్డు (ఈసీబీ) దీనిని అంగీకరించడం లేదు. మధ్యే మార్గంగా ఈ టెస్టును రాబోయే రోజుల్లో మళ్లీ ఎప్పుడైనా ఆడేందుకు తాము సిద్ధమని బీసీసీఐ ప్రకటించింది. వచ్చే ఏడాది జూన్లో భారత జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం ఇంగ్లండ్కు వెళ్లాల్సి ఉంది. అప్పుడు ఏమైనా ఈ టెస్టు కోసం తేదీలు సర్దుబాటు చేయవచ్చు.


Click it and Unblock the Notifications












