
మాంచెస్టర్: వెస్టిండీస్తో జరుగుతున్న సిరీస్ నిర్ణాయక టెస్ట్లో ఇంగ్లండ్కు భారీ ఆధిక్యం దక్కింది. ఆ జట్టు స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్(6/31) సిక్సర్తో చెలరేగడంతో కరేబియన్ జట్టు 197 పరుగులకు కుప్పకూలింది. దీంతో ఆతిథ్య జట్టుకు 172 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. విండీస్ బ్యాటింగ్లో కెప్టెన్ జాసన్ హోల్డర్(46), డౌరిచ్(37), కాంప్బెల్ (32) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
ఇక ఐదుగురు బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్కే పరిమితం కావడం గమనార్హం. బ్రాడ్తో పాటు అండర్సన్ రెండు వికెట్లు తీయగా.. ఆర్చర్, వోక్స్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ లంచ్ బ్రేక్ సమాయానికి 4 ఓవర్లలో 10 పరుగులు చేసింది. క్రీజులో రోరీ బర్న్స్(2), డామ్ సిబ్లీ(8) ఉన్నారు.
ఇక 137/6 ఓవర్ నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన వెస్టిండీస్.. మరో 60 పరుగులే జోడించి కుప్పకూలింది. అయితే ఓవర్ నైట్ బ్యాట్స్మన్ హోల్డర్(46), డౌరిచ్(37) కొంత పోరాడినప్పటికీ బ్రాడ్ దెబ్బకొట్టాడు.
హోల్డర్ను వికెట్ల ముందు బోల్తా కొట్టించి ఏడో వికెట్కు నమోదైన 68 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. అయితే ఈ వికెట్తో విండీస్ పతనం ప్రారంభమైంది. మరో 17 పరుగుల వ్యవధిలోనే విండీస్ మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. ఈ మూడు బ్రాడ్కే దక్కడం విశేషం.