
మాంచెస్టర్: ఇంగ్లండ్తో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మ్యాచ్లో వెస్టిండీస్కు భారీ ఊరట లభించింది. భారీ వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే నాలుగో రోజు ఆట పూర్తిగా రద్దయింది. దీంతో నాలుగో రోజు ఆటలో పేసర్ స్టువర్ట్ బ్రాడ్ 500 వికెట్ల మైలురాయితో పాటు విజ్డెన్ ట్రోఫీని అందుకోవాలనుకున్న ఇంగ్లండ్ అభిమానుల ఆశలు అడియాశలయ్యాయి. ఒక రోజు ముందుగానే గెలుద్దామనుకున్న ఆతిథ్య జట్టు ఇక చివరి రోజు వరకు వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆటగాళ్లంతా పెవిలియన్కే పరిమితం కాగా.. అటు విండీస్ మాత్రం ఊపిరిపీల్చుకుంది. మూడో రోజు ఆదివారం 399 పరుగుల లక్ష్యం కోసం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కరీబియన్ జట్టు 6 ఓవర్లలో 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఉదయం నుంచే వర్షం కురుస్తుండడంతో తొలి రెండు సెషన్లు వర్షార్పణమైంది. వరుణుడు కాసేపు తెరిపినిచ్చినా మైదానం చిత్తడిగా మారిపోవడంతో ఆటకు వీలు కాని పరిస్థితి నెలకొంది. దీంతో టీ బ్రేక్ తర్వాత కాసేపటికే భారత కాలమానం ప్రకారం రా.8.40 గంటలకు అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
కాగా, చివరి రోజు మంగళవారం వాతావరణం మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. దీంతో ఇంగ్లండ్ మిగిలిన 8 వికెట్లను నేల కూలుస్తుందా.. లేక విండీస్ పోరాడి డ్రా చేసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. విండీస్ బ్యాటింగ్ బలహీనతను బట్టి చూస్తే రెండు రోజులు క్రీజ్లో నిలబడటం అసాధ్యంగా కనిపించింది. ఇప్పుడు ఒక రోజంతా వాన బారినపడటం జట్టుకు ఊరట కలిగించింది. మరో రోజు కూడా వరుణుడు వారికి అండగా నిలిస్తే విజ్డన్ ట్రోఫీని హోల్డర్ సేన నిలబెట్టుకుంటుంది.