మాంచెస్టర్: వెస్టిండీస్పై రెండో టెస్టులో గెలిచి సిరీస్ సమం చేద్దామనుకున్న ఇంగ్లండ్కు వరుణుడు గట్టి షాకిచ్చాడు. శనివారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆటను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. దాంతో నిర్ణీత సమయానికంటే మూడు గంటల ముందుగానే ఆట నిలిచిపోయింది. అయితే ఆదివారం నాడు పరిస్థితులు మెరుగ్గా ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ను 9 వికెట్లకు 469 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ శుక్రవారం రెండోరోజు ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 32 పరుగులు చేసింది. నైట్ వాచ్మన్ అల్జారి జోసెఫ్ (14 బ్యాటింగ్), క్రెయిగ్ బ్రాత్వైట్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు వెస్టిండీస్ ఇంకా 437 పరుగులు వెనుకంజలో ఉంది.
ఇక మూడోరోజు ఆట వర్షంతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో మిగిలిన రెండు రోజుల్లో 196 ఓవర్లలో వెస్టిండీస్ జట్టును రెండుసార్లు ఆలౌట్ చేయడం ఇంగ్లండ్ బౌలర్లకు శక్తికి మించిన పనే. రోజంతా వర్షంతో పిచ్ మొత్తం కప్పి ఉంచడంతో నాలుగోరోజు ఆటలో తేమ పరిస్థితులను ఇంగ్లండ్ పేసర్లు సద్వినియోగం చేసుకున్నా.. ప్రత్యర్థి 19 వికెట్లను పడగొట్టడం కష్టమే. అందునా తొలి టెస్టు నెగ్గిన ఊపులో ఉన్న పర్యాటక జట్టు అంత సులువుగా లొంగుతుందా అన్నది ప్రశ్నార్థకమే. మూడోరోజు కనీసం 20 ఓవర్ల ఆటన్నా జరిగుంటే ఇంగ్లండ్ జట్టుకు ఒకింత అవకాశముండేది.
అయితే మాంచెస్టర్లో ఉండే వాతావరణ పరిస్థితుల రీత్యా.. శుక్రవారం నాడు ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్లో చకచకా ఆడడంతోపాటు 400 పరుగులకే డిక్లేర్ చేసి ఉంటే వెస్టిండీస్ ఇన్నింగ్స్ ఇంకా ముందుగా ప్రారంభమయ్యేది. దాంతో ప్రత్యర్థివి మరో ఒకటి రెండు వికెట్లను పడగొట్టే అవకాశమూ ఇంగ్లండ్కు లభించేది. ఇక తొలి టెస్టు నెగ్గిన విండీస్ ప్రస్తుతం 1-0తో ముందంజలో ఉంది.
బ్యూటీ విత్ ట్యాలెంట్.. హ్యాపీ బర్త్డే స్మృతి మంధనా!!
https://telugu.mykhel.com/cricket/happy-birthday-smriti-mandhana-yuvraj-singh-leads-wishes-as-india-opener-turns-24-029225.html