మాంచెస్టర్: ఇంగ్లండ్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్కు జరిమానా పడింది. పాకిస్థాన్తో జరిగిన తొలి టెస్ట్లో ప్రత్యర్థి బ్యాట్స్మన్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు.. బ్రాడ్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. అలాగే ఓ డీ మెరిట్ పాయింట్ను కేటాయించారు. ఈ మేరకు మ్యాచ్ రిఫరీ, బ్రాడ్ తండ్రి అయిన క్రిస్ బ్రాడ్ నిర్ణయం తీసుకున్నాడు.
పాక్ రెండో ఇన్నింగ్స్ 46వ ఓవర్లో స్పిన్నర్ యాసిర్ షాను ఔట్ చేసిన సందర్బంలో అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు అంపైర్లు గుర్తించారు. దీంతో ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్లోని ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించినట్లు తేల్చారు. ఎలాంటి విచారణ అవసరం లేకుండానే బ్రాడ్ తప్పును అంగీకరించాడని అతని తండ్రి క్రిస్ వెల్లడించారు. 24 నెలల కాలంలో బ్రాడ్ ఇలా చేయడం ఇది మూడోసారి.
రెండో టెస్టులో కనుక మరో డీమెరిట్ పాయింట్ చేరితే.. బ్రాడ్పై ఓ టెస్టు నిషేధం పడనుంది. నిబంధనల ప్రకారం రెండేళ్ల వ్యవధిలో ఓ ఆటగాడి ఖాతాలో నాలుగు డీమెరిట్ పాయింట్లు ఉంటే.. అతడిపై ఓ టెస్టు లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20ల నిషేధం విధిస్తారన్న విషయం తెలిసిందే. ఇక ఇంగ్లండ్ తరఫున 25 టెస్ట్లు, 34 వన్డేలు ఆడిన క్రిస్ బ్రాడ్.. ప్రస్తుతం ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీగా కొనసాగుతున్నాడు.
ఇక 2007 టీ20 ప్రపంచకప్లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు కొట్టిన మ్యాచ్లో కూడా క్రిస్ బ్రాడే మ్యాచ్ రిఫరీ. ఈ మ్యాచ్ అనంతరం తన కొడుకు కెరీర్ను దాదాపు పూర్తి చేసావని క్రిస్ బ్రాడ్ తనతో అన్నాడని యువరాజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నాడు. ఆ మ్యాచ్తో దాదాపు అతని కెరీర్ ముగిసిందని అందరూ భావించారు. కానీ బ్రాడ్ అద్భుతమైన ఆటతో ఇంకా క్రికెట్ ఆడుతున్నాడు. వెస్టిండీస్ సిరీస్లో బంతితో అదరగొట్టాడు. అవసరమైనప్పుడు బ్యాట్తో కూడా రాణించాడు.
ప్రస్తుతం పాకిస్థాన్ సిరీస్లో కూడా పర్వాలేదనిపించాడు. ఇక దాదాపు ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్లో అద్భుత విజయాన్నందుకున్న ఇంగ్లండ్ మూడు టెస్ట్ల సిరీస్లో 1-0తో లీడ్లో నిలిచింది. రెండు టెస్ట్ గురువారం(ఆగస్టు 13) నుంచి సౌతాంప్టన్ వేదికగా ప్రారంభంకానుంది.
లేజీ గర్ల్స్నే డబ్బు ఆకట్టుకుంటుంది.. సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసుపై మనోజ్ తివారీ ట్వీట్