
సౌతాంప్టన్: ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే మాత్రం మరో 210 పరుగులు చేయాలి. ఫాలోఆన్ ఆడుతూ సోమవారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 100 పరుగులు చేసింది. వర్షం అంతరాయం కలిగించడంతో నాలుగో రోజు 56 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఓపెనర్లు షాన్ మసూద్ (18; 2 ఫోర్లు), అబిద్ అలీ (42; 2 ఫోర్లు) పోరాడే ప్రయత్నం చేసినప్పటికి స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్లు అడ్డుకున్నారు. వికెట్లు ముందు బోల్తా కొట్టించి పెవిలియన్కు చేర్చాడు.
క్రీజులో కెప్టెన్ అజహర్ అలీ (29 బ్యాటింగ్), బాబర్ ఆజమ్ (4 బ్యాటింగ్) ఉన్నారు. ఈ ఇద్దరు నిలదొక్కుకొని చివరి రోజు ఆడితే మ్యాచ్ డ్రాగా ముగుస్తుంది. ఇంగ్లండ్ పేసర్ల ఫామ్ నేపథ్యంలో ఇది కష్టమే అని చెప్పవచ్చు. వర్షం అంతరాయం కలిగిస్తే మాత్రం పాక్కు గట్టెక్కినట్లే. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్లకు 583 పరుగులు చేసి డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. జాక్ క్రాలీ (267; 34 ఫోర్లు, సిక్స్) డబుల్ సెంచరీ... జోస్ బట్లర్ (152; 13 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీ సాధించారు.
అబిద్ అలీని అవుట్ చేయడంతో ఇంగ్లండ్ పేసర్ అండర్సన్ టెస్టు వికెట్ల సంఖ్య 599కు చేరుకుంది. వాస్తవానికి అండర్సన్ వేసిన మూడో ఓవర్లోనే ఓపెనర్ షాన్ మసూద్ ఇచ్చిన సులువైన క్యాచ్ను జోస్ బట్లర్ డ్రాప్ చేశాడు. లేకుంటే అతను నాలుగో రోజు ఆటలోనే 600 వికెట్ల మైలు రాయి అందుకునేవాడు. చివరి రోజు అండర్సన్ మరో వికెట్ తీస్తే టెస్టుల్లో 600 వికెట్లు పడగొట్టిన తొలి పేస్ బౌలర్గా గుర్తింపు పొందుతాడు. టెస్టుల్లో 600 కంటే ఎక్కువ వికెట్లు తీసిన ముగ్గురు బౌలర్లు మురళీధరన్ (శ్రీలంక), షేన్ వార్న్ (ఆస్ట్రేలియా), అనిల్ కుంబ్లే (భారత్) స్పిన్నర్లే కావడం గమనార్హం. ఇటీవల బ్రాడ్ 500 వికెట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే.