
సౌతాంప్టన్: ఫస్ట్ సెంచరీ హీరో ఓపెనర్ షాన్ మసూద్(4) చేతులేత్తేశాడు.! మరో ఓపెనర్ అబిద్ అలీ(1) ఆదుకోలేకపోయాడు.! నిలకడకు మారు పేరైన బాబర్ అజామ్(11) నిలబడలేకపోయాడు.! కష్టసమయాల్లో అండగా నిలవాల్సిన అసద్ షఫీక్(5), ఫవాద్ అలామ్(21) నిలదొక్కుకోలేకపోయారు.! దీంతో ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్లో పాకిస్థాన్ తేలిపోయింది. 75 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రత్యర్థి నిర్ధేశించిన భారీ స్కోర్ అందుకోవడం దేవుడెరుగు.. కనీసం ఫాలో ఆన్ ప్రమాదాన్ని కూడా తప్పించుకునే పరిస్థితి కనబడటం లేదు.
బౌలింగ్లో దారుణంగా విఫలమైన ఆ జట్టు.. బ్యాటింగ్లోనూ అదే తడబాటును కొనసాగిస్తోంది. ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ ధాటికి నలుగురు బ్యాట్స్మన్ పెవిలియన్ క్యూకట్టారు. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ అజార్ అలీ(125 బంతుల్లో 40 బ్యాటింగ్).. ఫవాద్ అలామ్తో ఆదుకునే ప్రయత్నం చేయగా.. స్పిన్నర్ డామ్ బేస్ దెబ్బతీశాడు. దీంతో పాక్ 47 ఓవర్లలో 5 వికెట్లకు 101 రన్స్ చేసింది. క్రీజులో అజార్ అలీతో పాటు వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్(9 బ్యాటింగ్) ఉన్నారు. పాక్ ఇంకా 482 పరుగుల వెనుకంజలో ఉంది. ఇప్పటికే మూడో రోజు ఆటలో వర్షం రెండు సార్లు అంతరాయం కలిగించింది.
ఇక జాక్ క్రాలీ(267) సూపర్ డబుల్ సెంచరీ, జోస్ బట్లర్ (152) సెంచరీతో ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 583/8 భారీస్కోర్ వద్ద డిక్లెర్ ఇచ్చిన విషయం తెలిసిందే. జాక్ క్రాలీ ఫస్ట్ సెంచరీనే డబుల్ సెంచరీగా మల్చుకోవడం విశేషం. ఈ మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసిన అండర్సన్.. 600 వికెట్ల క్లబ్లో చేరేందుకు మరో 3 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఇక తొలి టెస్ట్లో ఇంగ్లండ్ గెలవగా.. రెండో టెస్ట్ వర్షంతో ఫలితం తేలకుండా ముగిసింది.