మాంచెస్టర్: కరోనా బ్రేక్ అనంతరం ప్రారంభమైన రెండో టెస్ట్ సిరీస్కు కూడా వరణుడు అంతరాయం కలిగించాడు. ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్ల మధ్య మూడు టెస్ట్ల సిరీస్లో భాగంగా బుధవారం ప్రారంభమైన ఫస్ట్ టెస్ట్ వర్షం కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పాక్..ఆట నిలిచిపోయే సమయానికి 41.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 121 రన్స్ చేసింది. క్రీజులో హాఫ్ సెంచరీ చేసిన వైస్ కెప్టెన్ బాబర్ ఆజామ్(52 బ్యాటింగ్)తో పాటు ఓపెనర్ షాన్ మసూద్(45 బ్యాటింగ్) ఉన్నారు.
అంతకుముందు ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ అబిద్ అలీ(16)ని జోఫ్రా ఆర్చర్ ఔట్ చేయగా.. కొద్ది సేపటికే కెప్టెన్ అజార్ అలీని క్రిస్ వోక్స్ డకౌట్గా పెవిలియన్ చేర్చాడు. దీంతో పాక్ 43 రన్స్కే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన వైస్ కెప్టెన్ బాబర్ ఆజామ్ బాధ్యతాయుతంగా ఆడాడు. ఓపెనర్ షాన్ మసూద్తో కలిపి ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ గాడిలో పడేసాడు. దీంతో పాక్ 113/2తో డ్రింక్స్ బ్రేక్కు వెళ్లింది. అనంతరం 70 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో బాబర్ హాఫ్ సెంచరీ పూర్తిచేయగా.. వర్షం మొదలైంది. దీంతో అంపైర్లు తాత్కలికంగా మ్యాచ్ నిలిపేసారు.
కరోనా విరామం తర్వాత పాకిస్థాన్ ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే కాగా.. ఇంగ్లండ్ మాత్రం ఇప్పటికే టెస్ట్, వన్డే సిరీస్లు ఆడేసింది. వెస్టిండీస్తో మూడు టెస్ట్ల సిరీస్ను 2-1తో కైవసం చేసుకున్న ఇంగ్లండ్.. ఐర్లాండ్తో మూడు వన్డేల సిరీస్ను 2-1తోనే గెలుచుకుంది.
వెస్టిండీస్తో విజయాన్నందుకున్న జట్టుతోనే ఆతిథ్య ఇంగ్లండ్ బరిలోకి దిగగా.. పాక్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. ఇక చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్కు నిరాశే ఎదురైంది. పాక్ ప్రకటించిన 16 మంది సభ్యుల్లో అతని పేరున్నా.. తుది జట్టులో మాత్రం అవకాశం దక్కలేదు.
రామమందిర భూమి పూజపై మహ్మద్ కైఫ్ ట్వీట్.. మండిపడుతున్న ఫ్యాన్స్!