
సౌతాంప్టన్: వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్లో అదరగొట్టిన ఇంగ్లండ్ ఇప్పుడు వన్డే వార్కు రెడీ అయింది. ఐర్లాండ్తో మూడు వన్డేల సిరీస్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. గురువారం జరిగే తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభంకానుంది. టాప్ టీమ్, చిన్న జట్టు మధ్య పోటీనే అయినప్పటికీ వరల్డ్ క్రికెట్ దృష్టి దీనిపై ఉంది. ఎందుకంటే వన్డేలకు ఆదరణ పెంచేందుకు ఐసీసీ ప్రవేశపెట్టిన సూపర్ లీగ్ ఈ సిరీస్తోనే మొదలవనుంది. 2023 వన్డే ప్రపంచకప్కు ఈ లీగ్ క్వాలిఫికేషన్గా నిలవనుంది.
ఇందులో భాగంగా మూడేళ్లలో ప్రతీ జట్టు 8 సిరీస్లు ఆడనుంది. దాంతో మెగాలీగ్లో బోణీ కొట్టి వరల్డ్కప్ అర్హతకు బాటలు వేసుకోవాలని ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలోని ఇంగ్లండ్ భావిస్తోంది. స్టోక్స్, జోరూట్, బట్లర్కు విశ్రాంతి ఇవ్వగా విండీస్తో టెస్ట్ సిరీస్ ఆడిన వాళ్లలో జో డెన్లీ ఒక్కడే వన్డే టీమ్లో ఉన్నాడు. జాసన్ రాయ్, బెయిర్స్టో, మోర్గాన్, మొయిన్ అలీ, ఆదిల్ రషీద్తో హోమ్టీమ్ బలంగానే ఉంది.
మరోవైపు 2011లో ఇంగ్లండ్ను ఓడించి సంచలనం సృష్టించిన ఐర్లాండ్ మరోసారి అలాంటి సూపర్ పెర్ఫామెన్స్ కనబర్చాలని ఆశిస్తోంది. కెవిన్ ఒబ్రెయిన్, పాల్ స్టిర్లింగ్పై అంచనాలున్నాయి. కరోనా తర్వాత జరుగుతున్న ఫస్ట్ వన్డే సిరీస్లో ఆండీ బాల్బిర్నీ కెప్టెన్సీలోని ఐర్లాండ్ ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాలి. సాయంత్రం 6.30 గంటలకు సౌతాంప్టన్ వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుండగా.. సోనీ సిక్స్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.