ఓపెనర్లు జోరు..
ఇంగ్లండ్ జట్టుకు ఓపెనర్లు విన్ఫీల్డ్ (63 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35), బీమంట్ శుభారంభం అందించారు. పెద్దగా పదును లేని భారత బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ వైఫల్యాలను వీరిద్దరు చక్కగా ఉపయోగించుకున్నారు. ఎట్టకేలకు వికెట్ కీపర్ తానియా అద్భుత క్యాచ్కు విన్ఫీల్డ్ వెనుదిరిగింది. అయితే బీమాంట్, కెప్టెన్ నైట్ అదే జోరును కొనసాగించారు. ఇద్దరు ఆఫ్స్పిన్నర్లు స్నేహ్, దీప్తిలను వీరిద్దరు సమర్థంగా ఎదుర్కొన్నారు. భారత తుది జట్టులో లెఫ్టార్మ్ స్పిన్నర్ కూడా లేని లోటు ఇక్కడ స్పష్టంగా కనిపించింది. కొద్ది సేపటికే బీమంట్ 99 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. అనంతరం షార్ట్లెగ్లో ముందుకు దూకుతూ షఫాలీ చక్కటి క్యాచ్ పట్టడం తో బీమాంట్ ఆట ముగిసింది. ఆ తర్వాత వచ్చిన నటాలియా స్కివర్ (75 బంతుల్లో 6 ఫోర్లతో 42) కూడా కెప్టెన్కు తగిన సహకారం అందించింది. 115 బంతుల్లో నైట్ హాఫ్ సెంచరీ పూర్తయింది.
మూడు రివ్యూలు భారత్కే
నిలదొక్కుకున్న స్కివర్ను దీప్తి వికెట్ల ముందు దొరకబుచ్చుకొని ఇంగ్లండ్ పతనానికి శ్రీకారం చుట్టింది. ఆ వెంటనే అమీ జోన్స్ (1)ను కూడా రాణా ఇలాగే అవుట్ చేసింది. దీప్తి ఇదే జోరులో నైట్ను కూడా ఎల్బీగా పట్టేసింది. ఈ మూడు వికెట్లకు కూడా ఇంగ్లండ్ డీఆర్ఎస్ కోరగా...మూడు సార్లు ఫలితం భారత్కు అనుకూలంగా రావడం విశేషం. సెంచరీ చేజార్చుకున్న నిరాశలో కెప్టెన్ వెనుదిరగ్గా, ఎల్విస్ (5) ఆమెను అనుసరించింది.
చెత్త ఫీల్డింగ్..
దురదృష్టవశాత్తూ భారత జట్టు తొలి రోజు పేలవ ఫీల్డింగ్ను ప్రదర్శించింది. జులన్ బౌలింగ్లో విన్ఫీల్డ్ (3 పరుగుల వద్ద) ఇచ్చిన క్యాచ్ను స్మృతి, హర్మన్ బౌలింగ్లో సివర్ (స్కోరు 36) ఇచ్చిన సునాయాస క్యాచ్ను దీప్తి వదిలేయగా...26 పరుగుల వద్ద నైట్ ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్ను హర్మన్ అందుకోలే కపోయింది. సమన్వయలోపంతో ఒక సునాయాస రనౌట్ చేయడంలో కూడా మన అమ్మాయిలు విఫలమయ్యారు. తీవ్రమైన ఎండ కూడా మహిళలను కొంత ఇబ్బంది పెట్టింది.