
హైదరాబాద్ : సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఇంగ్లండ్ యువ స్పిన్నర్ మాథ్యూ పార్కిన్సన్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్కు గురయ్యాడు.
గతంలో టీమిండియా లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీలను బండబూతులు తిట్టిన ఈ యువ స్పిన్నర్పై భారత అభిమానులు ముప్పెట దాడి చేశారు. దీంతో అతను తన ట్విటర్ ఖాతా నుంచి సుమారు 3వేల ట్వీట్లను తొలగించాడు. అయినా వాటి స్క్రీన్ షాట్స్ను షేర్ చేస్తూ పార్కిన్సన్పై ఫ్యాన్స్ రివేంజ్ తీసుకుంటున్నారు.

ఇక పార్కిన్సన్ చేసిన ట్వీట్లలో కోహ్లీ అహంకారని, ధోనికి సిగ్గులేదని రాయలేని పదాలతో తిట్టాడు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రవీంద్ర జడేజా మూడు ట్రీపుల్ సెంచరీలు చేసినా.. ఇంటర్నేషనల్ క్రికెట్లో మాత్రం బ్యాటింగ్ చేయలేడని ఎగతాళి చేశాడు. అయితే ఇప్పుడు భారత అభిమానుల ట్రోలింగ్తో తన తప్పు తెలుసుకున్న పార్కిన్సన్ దాన్ని దిద్దుకునే పనిలో పడ్డాడు. మొత్తానికి ఫ్యాన్స్ దెబ్బకు ట్విటర్లో ట్రెండ్ అవుతున్నాడు.

ఇక ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్తోనే అరంగేట్రం చేసిన పార్కిన్సన్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ వన్డేకు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టి అవకాశం దక్కించుకున్న ఈ యువ లెగ్ స్పిన్నర్.. కీలక మ్యాచ్లో మాత్రం రాణించలేకపోయాడు. మరోసారి విఫలమైతే జట్టులో చోటు కోల్పోయే ప్రమాదాన్ని తెచ్చుకున్నాడు. మరోవైపు ఆదిల్ రషీద్తో పాటు జో డెన్లీ, జోరూట్లు స్పిన్ బౌలింగ్ ఆప్షన్గా ఉండటంతో అతని స్థానానికి ముప్పొచ్చింది. ఈ ఒత్తిడితోనే శుక్రవారం జరగబోయే రెండో వన్డే బరిలోకి దిగనున్నాడు.