ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో టీమిండియా జోరుకు కళ్లెం వేసేందుకు ఇంగ్లండ్ మాస్టర్ ప్లాన్ రచించింది. బ్యాటింగ్లో దుమ్మురేపుతున్న భారత బ్యాటర్లకు చెక్ పెట్టేందుకు లార్డ్స్లో బౌలింగ్ పిచ్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. లీడ్స్, ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి రెండు టెస్ట్ల్లో టీమిండియా బ్యాటర్లు దుమ్మురేపారు. లీడ్స్ టెస్ట్లో భారత ఆటగాళ్లు ఐదు శతకాలు నమోదు చేయగా.. ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో శుభ్మన్ గిల్ ఒక్కడే డబుల్ సెంచరీతో పాటు మరో శతకం నమోదు చేశాడు. పంత్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజాలు హాఫ్ సెంచరీలు బాదారు.
తొలి టెస్ట్లో చెలరేగిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. రెండో టెస్ట్లో తడబడ్డారు. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న ఫ్లాట్ వికెట్పై భారత్ను బోల్తా కొట్టించాలనే వ్యూహం బెడిసి కొట్టడంతో ఇంగ్లండ్ తమ ప్లాన్ను మార్చినట్లు తెలుస్తోంది. తొలి టెస్ట్లో విజయం దక్కినా.. రెండో టెస్ట్లో ఆకాశ్ దీప్ సంచలన ప్రదర్శనతో ఓటమి తప్పలేదు. ఈ క్రమంలోనే భారత్కు ప్రధాన బలంగా మారిన బ్యాటింగ్ విభాగాన్ని దెబ్బతీయాలని ఇంగ్లండ్ భావిస్తోంది. ఈ క్రమంలోనే లార్డ్స్ పిచ్ను బౌలింగ్ అనుకూలంగా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.

పిచ్పై గ్రాస్ ఎక్కువగా ఉంటే బ్యాటింగ్ కష్టమవుతుంది. ముఖ్యంగా పేసర్లకు ఎక్కువ సహకరిస్తోంది. మూడో టెస్ట్కు ఇంగ్లండ్ తరఫున ఆర్చర్, అట్కిసన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే బౌలింగ్కు అనుకూలంగా ఉండే వికెట్ తయారు చేయాలని ఇంగ్లండ్ టీమ్మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వాస్తవానికి ఇంగ్లండ్ పిచ్లు ఎప్పుడూ బౌలింగ్కు అనుకూలంగా ఉంటాయి. కానీ తాజా పర్యటనలో మాత్రం సంప్రదాయానికి విరద్దుంగా ఫ్లాట్ వికెట్స్ తయారు చేశారు. సీనియర్ పేసర్లు అందుబాటులో లేకపోవడంతో ఇంగ్లండ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఫ్లాట్ వికెట్స్పై భారీ పరుగులు చేసి భారత్ను బోల్తా కొట్టించాలనుకుంది. తొలి టెస్ట్లో ఫలితం దక్కినా.. రెండో టెస్ట్లో ప్రతికూల ఫలితం ఎదురైంది. దాంతో ప్లాన్ మార్చిన ఇంగ్లండ్.. ఆర్చర్, అట్కిన్సన్ చేరికతో పేస్ పిచ్ను రెడీ చేస్తోంది. దాంతో లార్డ్స్ టెస్ట్లో పరుగుల వరద పారడం కష్టమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.