మాంచెస్టర్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో తొలి విజయాన్నందుకున్న ఇంగ్లండ్ మరో కీలక పోరుకు సిద్దమైంది. బుధవారం(జూలై 19) నుంచి మాంచెస్టర్ వేదికగా జరగనున్న నాలుగో టెస్ట్లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ బరిలోకి దిగే ఇంగ్లండ్ తుది జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. రెండు రోజుల ముందుగానే ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే నాలుగో టెస్ట్ ఆడే టీమ్ వివరాలను కూడా వెల్లడించింది. తుది జట్టులో ఏకైమ మార్పు మాత్రమే చేసింది. మూడు టెస్ట్ల్లో విఫలమైన ఓలీ రాబిన్సన్పై వేటు వేసిన ఇంగ్లండ్ టీమ్ మేనేజ్మెంట్.. అతని స్థానంలో వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ను తీసుకుంది. ఇక మూడో టెస్ట్ నుంచి జేమ్స్ అండర్సన్కు విశ్రాంతి కల్పించిన విషయం తెలిసిందే. తొలి రెండు టెస్ట్ల్లో అతను మూడు వికెట్లు మాత్రమే తీసాడు.

అండర్సన్ రీఎంట్రీతో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్లో స్పల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయనున్నారు. హ్యారీ బ్రూక్, జానీ బెయిర్ స్టో మరింత ముందుగా బ్యాటింగ్ చేసే చాన్స్ ఉంది. ఇక మూడో టెస్ట్లో విజయాన్నందుకొని సిరీస్ రేసులో నిలిచిన ఇంగ్లండ్.. విజేతగా నిలవాలంటే నాలుగో టెస్ట్ గెలవడం చాలా ముఖ్యం.
బజ్బాల్ కాన్సెప్ట్తో దూకుడుగా ఆడుతున్న అభిమానులను అలరిస్తున్న ఇంగ్లండ్.. తొలి రెండు టెస్ట్ల్లో విజయం ముంగిట బోర్లా పడింది. మూడో టెస్ట్కు మూడు మార్పులతో బరిలోకి విజయాన్నందుకుంది. జట్టులోకి వచ్చిన మార్క్వుడ్, క్రిస్ వోక్స్ అసాధారణ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
బెన్ డక్కెట్, జాక్ క్రాలీ ఓపెనర్లుగా బరిలోకి దిగనుండగా.. మొయిన్ అలీ, జోరూట్, హ్యారీ బ్రూక్ మిడిలార్డర్లో ఆడనున్నారు. బెన్ స్టోక్స్, జానీ బెయిర్ స్టో, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ లోయరార్డర్లో బ్యాటింగ్ చేయనున్నారు.
ఇంగ్లండ్ తుది జట్టు:
బెన్ డక్కెట్, జాక్ క్రాలీ, మొయిన్ అలీ, జోరూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్ స్టో, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్