
అహ్మదాబాద్: ఐపీఎల్ వేలానికి సరిగ్గా ఒక రోజు ముందు ఇంగ్లండ్ క్రికెటర్ మార్క్ వుడ్ రేసులో నుంచి తప్పుకున్నాడు. వేలంలో రూ.2 కోట్ల ఆటగాళ్ల జాబితాలో ఉన్న వుడ్.. కుటుంబంతో తగిన సమయం కేటాయించేందుకే వేలం నుంచి తన పేరును ఉపసంహరించుకున్నాడు. జాతీయ చానెళ్ల సమాచార మేరకు మార్క్ వుడ్ వేలం నుంచి తప్పుకున్న విషయాన్ని నిర్వహకులు ఫ్రాంచైజీలకు తెలియజేశారు.
ఇటీవలే భారత్కు వచ్చిన మార్క్ వుడ్.. బెయిర్ స్టోతో కలిసి బుధవారం చెన్నైలోని జట్టు శిబిరంలోకి చేరాడు. టీమిండియాతో జరగనున్న మిగిలిన రెండు టెస్టులతో పాటు పరిమిత ఓవర్ల సిరీస్ల్లో వీరిద్దరూ ఆడనున్నారు.
ఈ నిర్ణయంతో మార్క్వుడ్ ఆర్థికంగా చాలా నష్టపోనున్నాడు. రూ.2 కోట్ల జాబితాలో ఉన్న మార్క్ వుడ్కు మంచి ధరపలికేది. పలు ఫ్రాంచైజీలు ఈ ఇంగ్లండ్ బౌలర్ను తీసుకునేందుకు ఆసక్తికనబర్చాయి. గత సీజన్లో లసిత్ మలింగాకు రిప్లేస్మెంట్గా ఈ ఇంగ్లండ్ ప్లేయర్ కోసం ముంబై ఇండియన్స్ ప్రయత్నించినా అతను నిరాకరించాడు. దాంతో ముంబై జేమ్స్ పాటిన్సన్ను తీసుకుంది. 2018లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన మార్క్ వుడ్ ఆతర్వాత మళ్లీ ఐపీఎల్లో పాల్గొనలేదు.
ఇంగ్లండ్ జట్టుతో కూడా అతనికి కేవలం పరిమిత ఓవర్ల కాంట్రాక్టు మాత్రమే ఉంది. గత ఐదు టెస్ట్ సిరీస్లు ఆడినా.. అతనికి సంప్రదాయక ఫార్మాట్ కాంట్రాక్ట్ దక్కలేదు. మరో గంటలో ఐపీఎల్ 2021 సీజన్ కోసం నిర్వహించే వేలం ప్రారంభం కానుంది. మొత్తం 292 మంది ఆటగాళ్లు అదృష్టం పరీక్షించుకోనున్నారు. 8 ఫ్రాంచైజీలు మొత్తం కలిపి 61 మంది ప్లేయర్లను తీసుకునే అవకాశం ఉంది.