
అహ్మదాబాద్: భారత్తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన నాలుగో టీ20లో ఓటమిపాలైన ఇంగ్లండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్కు కారణమైన ఇంగ్లండ్ జట్టుపై మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ చర్యలు తీసుకున్నాడు. ఇంగ్లండ్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తూ జరిమానా విధించాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టీమ్ నిర్దిష్ట సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేసింది. ఈ తప్పిదాన్ని ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అంగీకరించడంతో పాటు పశ్చాతాపం వ్యక్తం చేయడంతో ఎలాంటి తదుపరి విచారణ లేకుండా మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు.
ఐసీసీ నిబంధనల్లోని ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్థిష్ట సమయానికన్నా తక్కువగా ఓవర్లు వేస్తే ఒక్కో ఓవర్ చొప్పున ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తారు. ఇక ఇదే సిరీస్ రెండో టీ20లో టీమిండియాకు కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ ఫీజులో కోత పడిన విషయం తెలిసిందే. ఇక తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా 8 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించి సిరీస్ రేసులో నిలిచింది.
ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 57) సూపర్ ఫిఫ్టీతో రాణించగా.. శ్రేయస్ అయ్యర్ (18 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. ఆర్చర్కు 4 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ (23 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్లు), జేసన్ రాయ్ (27 బంతుల్లో 40; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా ఫలితం లేకపోయింది. ఇక ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మకమైన ఆఖరి మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగానే శనివారం జరగనుంది.