భారత్తో లార్డ్స్ టెస్ట్లో అద్భుత విజయాన్నందుకున్న ఇంగ్లండ్కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) షాకిచ్చింది. లార్ట్స్ టెస్ట్లో స్లో ఓవర్ రేట్కు కారణమైన ఇంగ్లండ్ జట్టుపై కఠిన చర్యలు తీసుకుంది. నిబంధనల ప్రకారం డబ్ల్యూటీసీ పాయింట్స్లో కోత విధించడంతో పాటు ఇంగ్లండ్ ఆటగాళ్లకు జరిమానా విధిస్తూ చర్యలు తీసుకుంది.
ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్లో ఇంగ్లండ్ 22 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ నిర్ణీత సమయం కన్నా రెండు ఓవర్లు తక్కువగా వేసింది. దాంతో మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకున్నారు.
ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.22 ప్రకారం.. నిర్ణీత సమయంలో బౌలింగ్ పూర్తి చేయని జట్టు ఆటగాళ్లకు వారి మ్యాచ్ ఫీజులో ఓవర్కు 5 శాతం చొప్పున జరిమానా విధిస్తారు. ఇంగ్లండ్ ఆటగాళ్లు రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో 10 శాతం కోత విధిస్తూ జరిమానా విధించారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ప్లేయింగ్ కండిషన్స్ ఆర్టికల్ 16.11.2 ప్రకారం.. స్లో ఓవర్రేట్ కారణమైన జట్టుకు ఒక్క ఓవర్కు ఒక డబ్ల్యూటీసీ పాయింట్ను తగ్గిస్తారు. ఇంగ్లండ్ రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో రెండు పాయింట్లు కోత విధించారు. తమ తప్పిదాలను బెన్ స్టోక్స్ అంగీకరించడంతో తదుపరి విచారణ లేకుండా చర్యలు తీసుకున్నారు. స్పిన్నర్ షోయబ్ బషీర్ గాయపడటం.. ఇంగ్లండ్ కొంపముంచింది. పేసర్లే ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయడంతో సమయం వృథా అయ్యింది.

పాయింట్ల కోతతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబులో ఇంగ్లండ్ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. ఈ సైకిల్లో మూడు మ్యాచ్లకు మూడు గెలిచిన ఆసీస్ అగ్రస్థానంలో ఉండగా.. ఒక విజయంతో శ్రీలంక రెండో స్థానంలో ఉంది. మూడింటిలో రెండు గెలిచిన ఇంగ్లండ్ మూడో స్థానంలో ఉండగా.. ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచిన భారత్ నాలుగో స్థానానికి పడిపోయింది. ఈ సైకిల్ పూర్తయ్యేలోపు అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు డబ్ల్యూటీసీ 2027 ఫైనల్ మ్యాచ్ ఆడుతాయి. డబ్ల్యూటీసీ 2025 విజేతగా సౌతాఫ్రికా నిలిచింది. ఫైనల్లో ఆసీస్ను ఓడించింది. భారత్, ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జులై 23 నుంచి నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది.