టీ20 ప్రపంచకప్ 2024లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. గ్రూప్-బీలో భాగంగా శనివారం అర్థరాత్రి జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ డకవర్త్ లూయిస్ పద్దతిన 41 పరుగుల తేడాతో నమీబియాను ఓడించింది.వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్ను 10 ఓవర్లకు కుదించి ఆడించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్లకు 125 పరుగులు చేసింది.
చెలరేగిన బ్రూక్..
ఓపెనర్లు ఫిల్ సాల్ట్(11), జోస్ బట్లర్(0) విఫలమైనా.. జానీ బెయిర్ స్టో(18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 31), హ్యారీ బ్రూక్(20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 47 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. మోయిన్ అలీ(6 బంతుల్లో 2 సిక్స్లతో 16), లియామ్ లివింగ్ స్టోన్(4 బంతుల్లో 2 సిక్స్లతో 13) మెరుపులు మెరిపించారు.

నమీబియా బౌలర్లలో రుబెన్ ట్రంప్లెమన్(2/31) రెండు వికెట్లు తీయగా.. డేవిడ్ వైస్(1/6), బెర్నార్డ్ స్కోల్ట్జ్(1/24)తలో వికెట్ తీసారు. అనంతరం నమీబియా నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్లకు 84 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఓపెనర్ మైకేల్ వాన్ లింగెన్(29 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 33), డేవిడ్ వైసీ(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 27) రాణించినా ఫలితం లేకపోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, క్రిస్ జోర్డాన్ తలో వికెట్ తీసారు.
టాప్-2లో ఇంగ్లండ్..
ఈ విజయంతో ఇంగ్లండ్ గ్రూప్-బీలో రెండో స్థానంలో నిలిచింది. నాలుగు మ్యాచ్లకు రెండింటిలో(నమీబియా, ఓమన్) గెలిచిన ఇంగ్లండ్.. ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. స్కాట్లాండ్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దాంతో 5 పాయింట్స్తో రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు మూడింటికి మూడు గెలిచిన ఆస్ట్రేలియా గ్రూప్-బీ టాపర్గా నిలిచింది.
స్కాట్లాండ్తో చివరి మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్లో స్కాట్లాండ్ విజయం సాధిస్తే ఇంగ్లండ్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. ఆసీస్ గెలిస్తే మాత్రం ఇంగ్లండ్ సూపర్ 8కు అర్హత సాధిస్తోంది.