భారత్తో ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన ఇంగ్లండ్.. నాలుగో టెస్ట్కు ముందు తమ జట్టులో కీలక మార్పులు చేసింది. లార్ట్స్ టెస్ట్లో తీవ్రంగా గాయపడిన షోయబ్ బషీర్.. జట్టుకు దూరం కాగా వెటరన్ లెఫ్టార్మ్ స్పిన్నర్ లియామ్ డాసన్ రీఎంట్రీ ఇచ్చాడు. 8 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇంగ్లండ్ జట్టు పిలుపును అందుకున్నాడు.ఈ క్రమంలో ఇంగ్లండ్ క్రికెట్ వేల్స్ బోర్డు(ఈసీబీ) 14 మందితో కూడిన రివైజ్డ్ జట్టును మంగళవారం ప్రకటించింది.
మూడో టెస్ట్లో బషీర్ చేతి వేలికి గాయం కావడంతో తదుపరి రెండు టెస్ట్లకు అతను దూరమయ్యాడని తెలిపింది. అతని స్థానంలో లియామ్ డాసన్ను ఎంపిక చేసినట్లు ప్రకటించింది. డాసన్ చివరగా 2017లో సౌతాఫ్రికాతో ఆడాడు. ఇటీవల దేశవాళీ క్రికెట్లో రాణిస్తుండటంతో అతనికి ఈసీబీ అవకాశం కల్పించింది. బౌలింగ్తో పాటు బ్యాటింగ్ చేసే సామర్థ్యం డాసన్కు ఉండటం ఇంగ్లండ్ టీమ్కు కలిసొచ్చే అంశం. షోయబ్ బషీర్ దూరమైన నేపథ్యంలో డాసన్కు తుది జట్టులో చోటు దక్కనుంది. ఇంగ్లండ్ జట్టులో భాగంగా ఉన్న బెంచ్ ప్లేయర్స్ జెమీ ఓవర్టన్, సామ్ కుక్లను రిలీజ్ చేసింది. కౌంటీ క్రికెట్ ఆడేందుకు అనుమతిచ్చింది. జూలై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది.

సోమవారం లార్డ్స్ వేదికగా ముగిసిన మూడో టెస్ట్లో భారత్ 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అనూహ్య మలుపులు, ఉత్కంఠతో సాగుతూ వచ్చిన మ్యాచ్లో బ్యాటింగ్ వైఫల్యం టీమిండియా పతనాన్ని శాసించింది. 193 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో టీమిండియా 170 పరుగులకే ఆలౌటైంది. టెయిలెండర్స్ జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్లతో కలిసి రవీంద్ర జడేజా(61 నాటౌట్)ఒంటరిగా పోరాడినా ఫలితం లేకపోయింది.
30 బంతులాడిన సిరాజ్.. షోయబ్ బషీర్ బౌలింగ్లో దురదృష్టకర రీతిలో ఆఖరి వికెట్గా బౌల్డ్ అయ్యాడు. బషీర్ వేసిన బంతిని సిరాజ్ అద్భుతంగా డిఫెన్స్ చేసినప్పటికీ.. బంతి మెల్లిగా వెళ్లి వికెట్లను తాకింది. దాంతో భారత ఓటమి లాంఛనమైంది.
నాలుగో టెస్ట్కు ఇంగ్లండ్ ప్రకటించిన జట్టు:
బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకోబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, జాక్ క్రాలీ,
లియామ్ డాసన్, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్, క్రిస్ వోక్స్