ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా భారత్తో రెండో టెస్ట్ ఓడిన ఇంగ్లండ్.. మరో మ్యాచ్కు సిద్దమైంది. గురువారం నుంచి లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో టెస్ట్లో టీమిండియాతో అమీతుమీ తేల్చుకోనుంది. విజయంతో ఈ సిరీస్ను ప్రారంభించిన ఇంగ్లండ్.. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో ఘోర పరాజయం చవిచూసింది. ఈ సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. దాంతో లార్డ్స్ టెస్ట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మూడో టెస్ట్లో విజయం సాధించి మళ్లీ గెలుపు బాట పట్టాలనే పట్టుదలతో ఇంగ్లండ్ ఉంది. ఈ క్రమంలోనే తమ తుది జట్టు ఒకే ఒక మార్పు చేసింది. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తుది జట్టులోకి వస్తున్నట్లు ప్రకటించింది. జోష్ టంగ్ స్థానంలో జోఫ్రా ఆర్చర్ బరిలోకి దిగుతాడని పేర్కొంది. గస్ అట్కిన్సన్ రీఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరిగినా.. అందులో వాస్తవం లేదని విషయం స్పష్టమైంది. ఈ మేరకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది.

సుమారు నాలుగేళ్ల తర్వాత జోఫ్రా ఆర్చర్ టెస్ట్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. అతను తన చివరి టెస్ట్ మ్యాచ్ను 2021 ఫిబ్రవరిలో అహ్మదాబాద్ వేదికగా భారత్తో ఆడాడు. ఆ తర్వాత వరుస గాయాలతో సుదీర్ఘ ఫార్మాట్కు దూరమయ్యాడు. జోఫ్రా ఆర్చర్ రాకతో ఇంగ్లండ్ పేస్ బలం పెరగనుంది. తొలి రెండు టెస్ట్ల తరహాలోనే మ్యాచ్కు 24 గంటల ముందే ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించడం గమనార్హం.
ఇంగ్లండ్ తుది జట్టు:
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జోరూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జెమీ స్మిత్(కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్.